Andhra Pradesh: ఫ్రంట్లైన్ వర్కర్లకు భరోసానిస్తూ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, కోవిడ్తో మరణించిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు, స్టాఫ్ నర్సుకి రూ.20 లక్షలు,ఎమ్ఎస్ఓలకు రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
కరోనా నియంత్రణలో ముందుండి పోరాడుతున్న ఫ్రంట్లైన్ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం భరోసానిచ్చింది. జూనియర్ డాక్టర్ల ఎక్స్గ్రేషియా డిమాండ్ను నెరవేర్చింది. కోవిడ్తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్గ్రేషియా (Government announces ex-gratia to covid frontline workers) ప్రకటించింది.
Amaravati, June 14: కరోనా నియంత్రణలో ముందుండి పోరాడుతున్న ఫ్రంట్లైన్ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం భరోసానిచ్చింది. జూనియర్ డాక్టర్ల ఎక్స్గ్రేషియా డిమాండ్ను నెరవేర్చింది. కోవిడ్తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్గ్రేషియా (Government announces ex-gratia to covid frontline workers) ప్రకటించింది. కోవిడ్ విధి నిర్వహణలో (covid frontline workers) మృతి చెందిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు.. స్టాఫ్ నర్సుకి రూ.20 లక్షలు, ఎఫ్ఎస్ఓ లేదా ఎమ్ఎస్ఓలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా.. ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్గ్రేషియా ( ex-gratia) చెల్లించనున్నట్లు ఉత్తర్వులలో వెల్లడించింది. తక్షణమే ఎక్స్గ్రేషియా అందేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. జిల్లా కలెక్టర్లు సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి ఎక్స్గ్రేషియా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు టీకాలు వేసే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన సాగుతోంది. గడచిన 6 రోజుల్లో 3,19,699 మంది తల్లులకు కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. తల్లులకు విధిగా టీకాలు వేయాలని ఈ నెల 7న సీఎం వైఎస్ జగన్ ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
ఆ మరుసటి రోజు అంటే జూన్ 8 నుంచి 13వ తేదీ వరకూ 3.19 లక్షల మందికి టీకాలు వేశారు. చిన్నారులకు కరోనా సోకితే.. ఆ పిల్లలు తల్లి ఒడిలోనే ఉంటారు కాబట్టి తల్లులకు సోకకుండా వ్యాక్సిన్ వేయాలని సీఎం సూచించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించి తల్లులకు అత్యంత ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ వేస్తున్నారు. చిన్నారుల బర్త్ సర్టిఫికెట్, టీకా కార్డు వంటి ఏ ఆధారం చూపినా ఆ తల్లులకు సీవీసీ (కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్)లో విధిగా టీకా వేయాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు 18 లక్షల మంది ఉంటారని అంచనా.
మరికొద్ది రోజుల్లోనే తల్లులుందరికీ వ్యాక్సిన్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు విద్యా, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే వారికి వయసుతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ వేశారు. అలాంటి వారు గడచిన ఆరు రోజుల్లో 8 వేల మంది వరకూ టీకాలు వేయించుకున్నారు.