Kiran kumar reddy: బీజేపీలో చేరనున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. రెండు, మూడు రోజుల్లో ప్రకటన.. కిరణ్ కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ వ్యవస్థాపకులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన బీజేపీలోకి చేరడానికి సిద్ధమైనట్టు చెపుతున్నారు. ఇప్పటికే ఆయనతో బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపినట్టు సమాచారం.
Hyderabad, March 11: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran kumar reddy) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన బీజేపీలోకి (BJP) చేరడానికి సిద్ధమైనట్టు చెపుతున్నారు. ఇప్పటికే ఆయనతో బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపినట్టు సమాచారం. రెండు, మూడు రోజుల్లో బీజేపీ అగ్ర నాయకుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ (Telangana) బీజేపీలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. అంతేకాదు, జాతీయ స్థాయిలో ఆయనకు కీలక బాధ్యతలను కూడా అప్పగించనున్నారని చెపుతున్నారు. తన రాజకీయ జీవితాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభించి, చివరి వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. ముఖ్యమంత్రి పదవితో పాటు పలు బాధ్యతలను నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ విభజనను ముఖ్యమంత్రిగా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో... ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.