Nepal Bus Tragedy: నేపాల్ లో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడటంతో నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు.. 65 మంది గల్లంతు (వీడియోలతో)
పొరుగు దేశం నేపాల్ లో ఘోరం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి.
Newdelhi, July 12: పొరుగు దేశం నేపాల్ లో ఘోరం జరిగింది. కొండచరియలు (Landslide) విరిగిపడటంతో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో మొత్తం 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. అసలేం జరిగిందంటే.. ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ బస్సు నేపాల్ రాజధాని కాట్మండూకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున 3 గంటలకు సెంట్రల్ నేపాల్ లోని మదన్-ఆష్రిత్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. అదే సమయంలో అటువైపు వెళ్తున్న ఈ రెండు బస్సులు అదుపుతప్పి త్రిశూలి నదిలో పడిపోయాయి. నదీ ప్రవాహ తీవ్రతతో అవి రెండు కొట్టుకుపోయాయి. ఇందులో ఓ బస్సులో 24 మంది ఉండగా, మరో బస్సులో 41 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు.
వానతో సహాయక చర్యలకు ఆటంకం
గల్లంతైనవారికోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. అయితే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని తెలిపారు.