Lokesh Yuvagalam Padayatra: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి, పాదయాత్రలో నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు, 2014లోనే తాను పవన్ కల్యాణ్లో మంచి మనసును చూశానని వెల్లడి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra) తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు.
Tirupati, Feb 24: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra) తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. జగన్ ఓడిపోయిన రోజు వెళ్లిపోయిన పరిశ్రమలు మళ్లీ పరిగెత్తుకుంటూ వస్తాయని లోకేష్ చెప్పారు. ప్రైవేటు పెట్టుబడులకు రాయితీలు ఇస్తామని, పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చేలా చేస్తామన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని, రాజకీయ కక్షతో ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని, కక్ష సాధింపునకు చూపే శ్రద్ధలో కొంత అభివృద్ధిపైన చూపితే పరిశ్రమలు వస్తాయని లోకేష్ తెలిపారు. అయితే వారి తీరు వల్ల అనేక పరిశ్రమలు వెళ్లిపోయాయని లోకేష్ (Lokesh lashes out at YS Jagan) విమర్శించారు.
ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి ఈ మూడు కలిసి కట్టుగా వెళ్తేనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని, టీడీపీ హయాంలో 40వేల పరిశ్రమలు, 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. 32 వేల మందికి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించామని, సులభ రుణాలతో స్వయం ఉపాధి కల్పించామన్నారు. 35 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకున్నామని లోకేష్ అన్నారు. జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చి ఖాళీలు అన్నీ అయిదు సంవత్సరాల్లో భర్తీ చేస్తామని తెలిపారు.
కార్పొరేషన్ ద్వారా వంద మందికి ఉద్యోగాలు కల్పించి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామని, మహిళా సాధికారికత ఇంట్లో మొదలవ్వాలన్నారు. తమ ఇంట్లో మహిళలు గౌరవిస్తామని, మహిళలను గౌరవించాలని మన మనసులో నుంచి రావాలన్నారు. రాజకీయాల్లోనూ, పారిశ్రామిక వేత్తలుగానూ మహిళలను ప్రోత్సహించామని, ఇకపై కూడా ప్రోత్సహిస్తామని లోకేష్ వెల్లడించారు. గాలికి వచ్చే వారు గాలికే కొట్టుకుపోతారని, దొంగల చుట్టూ దొంగలు, రౌడీషీటర్ల చుట్టూ రౌడీషీటర్లు ఉంటారని, సమాజంలో మార్పు కోసం యువత కలిసి రావాలన్నారు. తిరుమలలో పింక్ డైమండ్ కొట్టేసినట్టు ఆరోపణలు చేసిన వారు ఈ నాలుగు సంవత్సరాల్లో ఏం చేశారని, ప్రజలందరూ ఆరోపణలు చేయటం సులభమని, తాను చిత్తశుద్ధితో పని చేశానని, ఏ నాడు తప్పు చేయలేదని లోకేష్ వెల్లడించారు.
అన్న క్యాంటీన్లను మూసేయటం బాధాకరమని, టీడీపీ అధికారంలోకి రాగానే మొదటి వంద రోజుల్లోనే అన్న క్యాంటీన్లను తెరుస్తామని, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ హబ్గా తిరుపతి ఉంటుందని, ఇదే చంద్రబాబు కల అని, మరో సెన్ జెన్గా తిరుపతి రూపొందుతుందని లోకేష్ అన్నారు. ఉపాధికి నాణ్యమైన విద్య కోసం ఏడాది లోపు సిలబస్ మార్పు చేస్తామని, క్రీడల్లో తెలుగువారు విజేతలు కావటానికి తిరుపతిలో స్పోర్ట్స్ యూనివర్శిటీ తెస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరెవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనసు అని, 2014లోనే తాను పవన్ కల్యాణ్ లో మంచి మనసును చూశానని లోకేశ్ వెల్లడించారు.
కాగా, లోకేశ్ పాదయాత్రలో భాగంగా నేడు ఆటోడ్రైవర్లతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, తద్వారా నిత్యావసరాల ధరలు పెరిగాయని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం బాగుపడాలంటే బాబు రావాలని అన్నారు.