
Lucknow, September 13: నేరాలకు పాల్పడితే ఎన్కౌంటర్ (Encounter) చేస్తామంటూ.. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి (UP CM) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) చేసిన హెచ్చరికలు నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి భయంతో మెడలో ఓ బోర్డు తగిలించుకుని పోలీస్ స్టేషన్కు వచ్చాడు. తాను లొంగిపోతానని, జీవితంలో మరోసారి నేరాలకు పాల్పడనని, తనను ఎన్కౌంటర్ చేయొద్దని అట్టపైన రాసి మెడలో వేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 9న ఘజియాబాద్లో ఓ హత్య జరిగింది. ఈ కేసులు పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరొకడు పరారీలో ఉన్నాడు.
పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు సోహైల్ను పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో ఎస్పీ ఓ ప్రకటన చేశారు. అవసరమైతే నిందితుడిని ఎన్కౌంటర్ చేస్తామని, ఈ విషయంలో ప్రభుత్వ ఆదేశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు. అంతే, అది విన్న నిందితుడు సోహైల్ ఎన్కౌంటర్ తప్పదని భయపడిపోయాడు.
ఇక తప్పించుకుని లాభం లేదని పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మెడకు ఓ బోర్డు తగిలించుకుని పోలీస్ స్టేషన్కు బయలుదేరాడు. తాను లొంగిపోతున్నానని, మరోమారు ఇలాంటి నేరాలకు పాల్పడబోనని, తనను ఎన్కౌంటర్ చేయొద్దని వేడుకున్నాడు. నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.