Chandrayaan 3 Update: స్లీప్ మోడ్‌లో నుంచి ఇంకా బయటకు రాని విక్రమ్‌, శనివారం మేల్కొలిపే ప్రక్రియ చేపడతామని తెలిపిన ఇస్రో
Chandrayaan 3 (PIC@ X)

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో..చంద్రయాన్‌ 3 మిషన్‌ గురించి కీలక అప్‌డేట్‌ అందించింది. చంద్రుడిపై స్లీప్ మోడ్ లో ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్ ను మేల్కొలిపే ప్రక్రియను రేపటికి వాయిదా వేసింది.కాగా గత 14 రోజుల నుంచి చంద్రుడిపై చీకటి ఉండటంతో ల్యాండర్‌, రోవర్‌ స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం జాబిల్లిపై సూర్మరశ్మి వెలుతురు పడటంతో నేడు(శుక్రవారం) వీటిని పునరుద్దరించేందకు ప్రయత్నించారు. అయితే సాధ్యం కాకపోవడంతో రేపటికి వాయిదా వేశారు.

ఈ మేరకు స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ మాట్లాడుతూ.. ఇంతకుముందు తాము సెప్టెంబర్ 22 సాయంత్రం ప్రగ్యాన్‌ రోవర్‌, విక్రమ్‌ ల్యాండర్‌ను తిరిగి యాక్టివేట్‌ చేయాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్లాన్‌ను సెప్టెంబర్‌ 23న చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

మరో కీలక ఘట్టం భూమికి బైబై చెప్పి సూర్యుడి వైపు వెళుతున్న ఆదిత్య ఎల్‌-1, ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహ కక్ష్య పెంపు మరోసారి సక్సెస్

ఆగస్టు 23న ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూన్‌ ప్రాజెక్ట్‌ చంద్రయాన్‌-3 విజయవంతమైన సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ 23న చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్‌ ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండ్‌ అయ్యింది. దీంతో అక్కడ అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. ల్యాండర్‌ నుంచి చంద్రుడి ఉపరితలంపైకి దిగిన రోవర్‌ సుమారు 105 మీటర్ల దూరం వరకు కదిలింది.ల్యాండర్‌ దిగిన ప్రదేశాన్ని భారత్‌ ‘శివ శక్తి పాయింట్‌’గా నామకరణం చేసింది.

14 రోజులపాటు అక్కడి వాతావరణ, నీటి పరిస్థితి, ఖనిజాల గురించి అధ్యయనం చేసి కీలక సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది. ఇస్రో మొదట రోవర్ 300-350 మీటర్ల దూరం ప్రయాణించేలా ప్లాన్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల రోవర్ ఇప్పటి వరకు 105 మీటర్లు మాత్రమే కదిలింది. అయినప్పటికీ, మిషన్ దాని లక్ష్యాలను అధిగమించింది.

ఆదిత్య ఎల్1 నుంచి కీలక అప్‌డేట్, మిషన్‌ శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టిందని తెలిపిన ఇస్రో

సాధారణంగా చంద్రునిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. ఈ కారణంగా రాత్రిళ్లు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 వరకు ఉంటోంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై లూనార్‌ నైట్‌ ప్రారంభం కావడంతో సెప్టెంబర్‌ 2న రోవర్‌ను, 4న ల్యాండర్‌ను స్లీప్‌ మోడ్‌లో ఇస్రో ఉంచింది. అయితే శుక్రవారం నుంచి చంద్రుడిపై తిరిగి లూనార్‌ డే ప్రారంభమైంది.

సూర్యోదయం కావడంతో రోవర్‌పై సూర్యర్శ్మి పడగానే, పరికరాలు వేడి అవుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ తర్వాత ల్యాండర్, రోవర్‌ నుంచి సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. రోవర్, ల్యాండర్‌ను నిద్రలేపి మళ్లీ క్రియాశీలకంగా మార్చితే.. చంద్రునిపై మరింత సమాచారాన్ని సేకరించవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. దీంతో నిద్రావస్థలో ఉన్న ల్యాండర్‌, రోవర్‌ను తిరిగి యాక్టివ్‌ చేసే చర్యలను శనివారానికి ఇస్రో వాయిదా వేసింది.

లూనార్‌ నైట్ సందర్భంగా చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉండే మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు, అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఇవి తిరిగి పని చేస్తాయా అన్నది సందిగ్ధంగా మారింది. ఒకవేళ విక్రమ్ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ తిరిగి పని చేస్తే భారత్ మరో చరిత్ర సృష్టించినట్లు అవుతుంది.