Nepal Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం, ఆరుగురు మృతి, భారీగా ఆస్తినష్టం, అర్ధరాత్రి నుంచి ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు, భయంతో పరుగులు తీసిన రాజధానివాసులు
(Photo-ANI)

Khatmandu, NOV 09: నేపాల్‌లో భారీ భూకంపం (Earthquake In Nepal) సంభవించింది. భూకంపం ధాటికి ఇల్లు కూలి ఆరుగురు ఆరుగురు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైందని నేపాల్‌ (Nepal) సీస్మోలజికల్‌ సెంటర్‌ వెల్లడించింది. దీపయాల్‌కు 21 కిలోమీటరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని పేర్కొంది. భూకంపం ధాటికి దోటి జిల్లాలోని గైరాగాన్‌ ప్రాంతంలో ఇల్లు కూలిపోయింది. దీంతో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. మరికొందరు గాయపడ్డారని, ఆస్తినష్టం కూడా సంభవించిందని తెలిపారు. నేపాల్‌లో గత 24 గంటల్లో భూకంపం రావడం ఇది మూడోసారి. మంగళవారం రాత్రి 8.52 గంటల ప్రాంతంలో 4.9 తీవ్రతతో మొదటి భూకంపం వచ్చింది. మళ్లీ 9.41 గంటల సమయంలో 3.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. దీంతో పక్కనే ఉన్న ఉత్తరాఖండ్‌ |(Uttarakhand), ఢిల్లీతో (Delhi) పాటూ, రాజధాని ప్రాంతాల్లో (NCR) కూడా భూమి కంపించింది.

ఢిల్లీ, ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని ఘజియాబాద్‌ (Ghaziabad), గురుగ్రామ్‌ (Gurgaon), ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో గాఢ నిద్రలో ఉన్న ఢిల్లీ ప్రాంత ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌లో మరోసారి భూమి కంపించింది.

బుధవారం ఉదయం 6.27 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొన్నది. కాగా, గత పదేండ్లలో ఉత్తరాఖండ్‌లో 7 వందల సార్లు భూకంపాలు సంభవించాయని నిపుణులు తెలిపారు.