Bilkis Bano Case: బిల్కిస్ బానో రేప్ కేసులో ఊహించని ట్విస్ట్, దోషుల విడుదలను వెంటనే రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్, రిమీషన్ను ఉపసంహరించాలని కోరుతూ 6000 మంది సంతకాలు
గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో (Bilkis Bano)పై సామూహిక అత్యాచారం కేసులో (Bilkis Bano Case) 11 మంది దోషులను ఆగస్టు 15వ తేదీన గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి విదితమే.11 మంది నిందితులకు క్షమాభిక్ష పెట్టి గుజరాత్ సర్కారు విడుదల చేసింది.
New Delhi, August 23: గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో (Bilkis Bano)పై సామూహిక అత్యాచారం కేసులో (Bilkis Bano Case) 11 మంది దోషులను ఆగస్టు 15వ తేదీన గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి విదితమే.11 మంది నిందితులకు క్షమాభిక్ష పెట్టి గుజరాత్ సర్కారు విడుదల చేసింది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. రేప్ నిందితుల్ని ఎలా రిలీజ్ చేస్తారని విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 11 మంది నిందితుల రిలీజ్ అంశాన్ని విచారించనున్నట్లు (Supreme Court Agrees To Examine Plea ) సుప్రీంకోర్టు వెల్లడించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) ఈ పిటిషన్పై ( Remission of 11 Convicts of Rape and Murder) విచారణ జరిపేందుకు పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. నిందితుల రిలీజ్ను రద్దు చేయాలని కోరుతూ మహిళా హక్కుల కార్యకర్తలు సుభాషిని అలీ, రేవతి లౌల్, రూపా రేఖా వర్మలు సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనున్నది. సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్, అడ్వకేట్ అపర్ణా భట్లు ఈ కేసు తరపున వాదించనున్నారు. అంతకు ముందు.. సుమారు 6వేల మంది హక్కుల కార్యకర్తలు, చరిత్రకారులు దోషుల విడుదలను వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు.
కాగా బిల్కిస్ బానో రేప్ కేసు 2002లో నమోదు అయ్యింది. గోద్రా అల్లర్ల సమయంలో ఈ ఘటన జరిగింది. బిల్కిస్ బానోను రేప్ చేయడంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడు మందిని మర్డర్ చేశారు. అయితే 2008లో ముంబైలోని సీబీఐ కోర్టు 11 మంది నిందితులకు జీవితఖైదు శిక్షను ఖరారు చేసింది. జైలు నుంచి రిలీజైన వారిలో జశ్వంత్ భాయ్ నాహి, గోవింద భాయ్ నాహి, శైలేష్ భట్, రాధేశ్యామ్ షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్భాయ్ వోహనియా, ప్రదీప్ మోర్దియా, బకాభాయ్ వోహనియా, రాజుభాయ్ సోని, మితేష్ భట్, రమేశ్ చందన్ ఉన్నారు.
దోషుల విడుదలపై బిల్కిస్ బానో మాట్లాడుతూ, వీరిని విడుదల చేయడం వల్ల తన జీవితంలో శాంతి తనకు దూరమైందని, న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన బాధ, ఆవేదన కేవలం తనకోసం మాత్రమే కాకుండా న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి మహిళ కోసం అని చెప్పారు. ఈ దోషులు 15 సంవత్సరాలపాటు జైలు జీవితం గడిపారు. అనంతరం వీరిలో ఒక దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను విడుదల చేయాలని కోరారు.
దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం రిమీషన్ గురించి పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రిమీషన్ను ఉపసంహరించాలని కోరుతూ దాదాపు 6,000 మంది సుప్రీంకోర్టును కోరారు. ఈ స్టేట్మెంట్పై సంతకాలు చేసినవారిలో యాక్టివిస్టులు సయేదా హమీద్, జఫరుల్ ఇస్లామ్ ఖాన్, రూప్ రేఖ, దేవకి జైన్, ఉమా చక్రవర్తి, సుభాషిణి అలీ, కవిత కృష్ణన్, మైమూనా మొల్లా, హసీనా ఖాన్, రచన ముద్రబోయిన, షబ్నమ్ హష్మి తదితరులు ఉన్నారు.
(The above story first appeared on LatestLY on Aug 23, 2022 03:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

