Rohit Sharma Vs Hardik: ముంబై తో మ్యాచ్ లో పాండ్యాకు  చుక్కలు చూపించిన రోహిత్ ఫాన్స్, మ్యాచ్ జరుగుతున్నంతసేపూ రోహిత్ నామస్మరణే
Mumbai Indians captain Rohit Sharma

Ahmadabad, March 25: ఐపీఎల్ – 2024 మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. నువ్వానేనా అన్నట్లుగా ఇరు జట్ల ప్లేయర్లు చివరి వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుపై గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు స్టేడియంలో అభిమానులు రోహిత్ నామస్మరణతో ఊగిపోయారు. ముంబయి ఇండియన్స్ యాజమాన్యం ఈ సీజన్ కు జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మను (Rohit sharma) తప్పించి హార్దిక్ పాండ్యను నియమించడంపై పెద్దదుమారమే రేగింది. దీంతో ఈ సీజన్ లో ముంబయి తొలి మ్యాచ్ లో హార్ధిక్ నాయకత్వంలో రోహిత్ మైదానంలోకి దిగాడు. ఈ మ్యాచ్ లో అందరి దృష్టి రోహిత్ (Rohit Sharma), పాండ్యాల (Pandya) మీదనే నిలిచింది.

 

మైదానంలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య మధ్య ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తొలుత రోహిత్ శర్మ స్లిప్ లో ఫీల్డింగ్ కు వెళ్లాడు. కానీ, హార్దిక్ ఫీల్డింగ్ పొజిషన్ ను మార్చాలని సూచించడంతో.. రోహిత్ మరో స్థానానికి వెళ్లాడు. అయితే, రోహిత్ శర్మ ఎప్పుడూ స్లిప్ లోనే కానీ, బ్యాటర్ కు దగ్గరగా ఫీల్డింగ్ చేసేవాడు. కానీ, రోహిత్ ను బౌండరీ లైన్ వద్దకు ఫీల్డింగ్ చేయించడంపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రోహిత్ ను కావాలనే హార్దిక్ అవమానపర్చాడంటూ రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

 

రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్నంత సేపు స్టేడియంలో రోహిత్ రోహిత్ అంటూ అభిమానులు అరుపులతో హోరెత్తించారు. హార్దిక్ పాండ్యా టాస్ కోసం వచ్చినప్పుడు స్టేడియంలో అభిమానులు అతన్ని హేళన చేస్తూ అరిచారు. రోహిత్ మైదానంలో క్యాచ్ పట్టిన సమయంలో నరేంద్ర మోదీ స్టేడియం దద్దరిల్లిపోయింది.

 

రోహిత్, హార్దిక్ పాండ్యా మధ్య విబేధాలు ఉన్నట్లు ఈ మ్యాచ్ లో స్పష్టంగా కనిపించాయి. మ్యాచ్ లో ఓ సందర్భంలో బుమ్రా రోహిత్ తో మాట్లాడుతుంటే హార్దిక్ అసహనంతో వెళ్లిపోవటం, హార్దిక్ ను చూపిస్తూ బుమ్రాతో రోహిత్ ఏదో అనడం కనిపించింది.

 

మరోవైపు రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంత సేపు రోహిత్ కెప్టెన్.. రోహిత్ కెప్టెన్ అంటూ ప్లకార్డులతో స్టేడియంలో అభిమానులు సందడి చేశారు. రోహిత్ శర్మ ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లోనే తనదైన శైలిలోబ్యాటింగ్ చేశాడు. క్రీజులో ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సర్ల మోతమోగించాడు.