India vs Australia, 2nd T20I: రెండో టీ-20లో దుమ్మురేపిన టీమిండియా, రోహిత్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌ తో భారత్‌కు విక్టరీ, నాలుగు బాల్స్ ఉండగానే ఇండియా గెలుపు, ఆసిస్‌తో సిరీస్‌ సమం
Credits @Bcci Twitter

Nagpur, SEP 23: సిరీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా (Team india) దుమ్మురేపింది. నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో (Australia) జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో (2nd T20I) ఘనవిజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్ ఇన్నింగ్స్, దినేశ్ కార్తీక్ (Dinesh karthik) మెరుపులతో టీమిండియా గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 91 పరుగుల టార్గెట్ ను మరో 4 బంతులు మిగిలి ఉండగానే భారత్ చేధించింది. రోహిత్ సేన 7.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ… చెలరేగాడు. 20 బంతుల్లోనే 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముందుండి మరీ జట్టుని గెలిపించాడు. అతడి స్కోర్ లో 4 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. దినేశ్ కార్తీక్ 2 బంతుల్లోనే 10 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.

కాగా, ఈ మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. గతరాత్రి కురిసిన వర్షంతో మైదానం చిత్తడిగా ఉండడంతో ఓవర్లను 20 నుంచి 8కి తగ్గించారు. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో మాథ్యూ వేడ్ 43(20 బంతుల్లో-నాటౌట్), ఫించ్ 31 (15 బంతుల్లో) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (Axar Patel) 2 వికెట్లు తీశాడు. బుమ్రా ఒక వికెట్ తీశాడు.

T20 Tickets: హైదరాబాదీ క్రికెట్ ఫ్యాన్స్ అలర్ట్.. ఆస్ట్రేలియా, భారత్ మూడో టీ20 మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే జింఖానా మైదానంకు వచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాలి.. హెచ్ సీఏ కీలక ప్రకటన 

అనంతరం లక్ష్యఛేదనను టీమిండియా దాటిగా ఆరంభించింది. తొలి ఓవర్లోనే 20 పరుగులు సాధించి తన ఉద్దేశాన్ని చాటింది. కేఎల్ రాహుల్ 10, కోహ్లీ 11, పాండ్యా 9 పరుగులు చేశారు. ఆఖర్లో భారత్ విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా, తొలి బంతిని సిక్స్, రెండో బంతిని ఫోర్ కొట్టిన దినేశ్ కార్తీక్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్ ఒక వికెట్ తీశాడు. ఈ విజయంతో సిరీస్ ను 1-1తో సమం చేసింది భారత్. ఇక సిరీస్ విజేతను తేల్చే నిర్ణయాత్మక మ్యాచ్ ఈ నెల 25న హైదరాబాద్ లో జరగనుంది.