Commonwealth Games 2022: రెజ్లింగ్‌లో భారత్‌కు హ్యాట్రిక్‌ గోల్డ్ మెడల్స్, ఒకే రోజు మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన ఆటగాళ్లు, దుమ్మురేపిన సాక్షి మాలిక్, భజరంగ్ పునియా, దీపక్ పునియాలకు స్వర్ణాలు, మిగిలిన ఈవెంట్స్ లోనూ సత్తా చాటుతున్న భారత ఆటగాళ్లు

Birmingham, AUG 05: బ‌ర్మింగ్‌హ‌మ్‌లో జ‌రుగుతున్న కామ‌న్వెల్త్ గేమ్స్‌-2022లో రెజ్లింగ్‌ లో భారత్‌ కు హ్యాట్రిక్ స్వర్ణాలు లభించాయి. రెజ్లింగ్‌ లో సాక్షిమాలిక్, భజరంగ్ పునియా, దీపక్ పునియాలు వేర్వేరు విభాగాల్లో గోల్డ్ సాధించారు.  రెజ్లింగ్‌ లో సాక్షిమాలిక్ (Sakshi Malik) కు గోల్డ్ మెడల్ వచ్చింది. అటు మరో స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా కూడా గోల్డ్ సాధించాడు. సాక్షిమాలిక్ 62 కిలోల ఫ్రీస్టైల్ క్యాట‌గిరి రెస్లింగ్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం లభించింది. కెన‌డాకు చెందిన అనా గొంజాలెజ్‌పై సాక్షి విజ‌యం సాధించారు. ఒకానొక ద‌శ‌లో ప్ర‌త్య‌ర్థి అనా గొంజాలెజ్‌పై 0-4 తేడాతో వెనుక‌బ‌డ్డ సాక్షి మాలిక్ (Sakshi Malik) తిరిగి పుంజుకుని పై చేయి సాధించారు. కామ‌న్వెల్త్ గేమ్స్‌లో సాక్షి మాలిక్‌కు ఇది తొలి స్వ‌ర్ణ ప‌త‌కం. కామ‌న్వెల్త్ గేమ్స్‌లో మూడో ప‌త‌కం. తిరిగి చాంపియ‌న్ కావ‌డం చాలా మంచిగా అనిపించింద‌న్నారు. కామ‌న్వెల్త్ గేమ్స్‌లో స్వ‌ర్ణం గెలుచుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని చెప్పారు.

అటు రెజ్లింగ్ లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా (Bajrang Punia) దుమ్మురేపాడు. భారత్ కు గోల్డ్ మెడల్ అందించాడు. 65 కేజీల విభాగం ఫైనల్లో ప్రత్యర్థిని ఓడించి స్వర్ణాన్ని ముద్దాడాడు. దీంతో కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ పతకాల సంఖ్య 23కి పెరిగింది. మరోవైపు భజరంగ్ పూనియా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కామెన్ వెల్త్ గేమ్స్ లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన అతడు.. మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు.

పురుషుల ఫ్రీస్టైల్‌ 65 కేజీల విభాగంలో తలపడిన పూనియా.. కెనడాకు చెందిన లాచలాన్ మెక్‌నీల్‌ను 2-9 పాయింట్ల తేడాతో ఓడించి బంగారు పతకం సాధించాడు. 2014 కామన్‌వెల్త్ క్రీడల్లో సిల్వర్‌ మెడల్‌తో సరిపెట్టుకున్న ఈ 28 ఏళ్ల స్టార్ రెజ్లర్‌.. 2018లో వేల్స్‌కు చెందిన కేన్‌ చారిగ్‌ను ఓడించి స్వర్ణం సాధించాడు. ఈసారి మళ్లీ తన మ్యాజిక్‌ రిపీట్ చేసి స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నాడు.

 

ఇక మరో స్టార్ రెజ్లర్ దీపక్ పునియా కూడా తాను అడుగు పెట్టిన తొలి కామన్ వెల్త్ గేమ్స్ లోనే గోల్డ్ సాధించాడు. మెన్స్ 86 కేజీల విభాగంలో గోల్డ్ సాధించాడు. కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్‌ కు ఒకేరోజు మూడు స్వర్ణాలు రావడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. రెజ్లింగ్‌ లో మనోళ్ల సత్తా చూసి అంతా షాక్‌కు గురవుతున్నారు.