Telangana Elections 2024: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జోరందుకున్న వలసలు, చెక్ పెట్టేందుకు కేసీఆర్ సరికొత్త ఎత్తుగడ, పార్టీ మార్పుపై బీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే..
Kesavarao and kadiyam Srihari and Tatikonda Rajayya and KCR( Photo-File Image)

Hyd, mar 29: లోక్‌సభ ఎన్నికల ముంగిట తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సీట్ల కోసం, అధికారం కోసం నేతలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు దూకేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇస్తూ ఆ పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యేందుకు రెడీ అయ్యారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ఆ పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు ప్రకటించారు.ఇక వరంగల్‌ లోక్‌సభ స్థానం అభ్యర్థిని బీఆర్‌ఎస్‌ ప్రకటించాక కూడా బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది.

బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసేందుకు టికెట్‌ దక్కించుకున్న బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య హఠాత్తుగా బరి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు గురువారం రాత్రి లేఖ రాశారు. కాగా కడియం శ్రీహరి, కావ్య కూడా త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. కడియం శ్రీహరి వరంగల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. హన్మకొండలో మాజీ మంత్రి కేటీఆర్‌ పై కేసు నమోదు.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన హన్మకొండ పోలీసులు

కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరడం ఇప్పటికే ఖాయం కాగా.. ఇలా ఇద్దరు నేతలు దాదాపుగా ఒకే సమయంలో తమ కుమార్తెలతో సహా బీఆర్‌ఎస్‌ను వీడనుండటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ నాకు సొంత ఇల్లు లాంటిది. నేను పుట్టింది, పెరిగింది కాంగ్రెస్‌లోనే. 53 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీ లోనే పని చేశా. ఆ పార్టీలోనే చనిపోవాలనుకుంటున్నా. తీర్థయాత్రలకు వెళ్లినవారు ఎప్పటికైనా ఇంటికే చేరతారు. 84 ఏళ్ల వయసులో నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరతా..’ అని కేకే గురువా రం నాడిక్కడ మీడియాకు చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీయే తెలంగాణ ఇచ్చింది: కేశవరావు

అంతకుముందు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తో కేకే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసినట్లు సమాచారం కాగా..ఆ తర్వాత బంజారాహిల్స్‌ నివాసంలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.బీఆర్‌ఎస్‌లో నేను పని చేసింది పదేళ్లు మాత్రమే. తెలంగాణ కోసమే బీఆర్‌ఎస్‌లో చేరా. కానీ కాంగ్రెస్‌ పార్టీయే తెలంగాణ ఇచ్చింది. నేను మొదటి సారి కాంగ్రెస్‌ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యా. ప్రస్తుతం నేను బీఆర్‌ఎస్‌కు ఇంకా రిజైన్‌ చేయలేదు. నా కూతురు చేరిన రోజే నేను కాంగ్రెస్‌లో చేరబోవడం లేదు. ఏ రోజు చేరేదీ తేదీ ఖరారు అయిన తర్వాత చెబుతా..’ అని కేకే చెప్పారు.

Here's Videos

కాంగ్రెస్ లో చేరాక కేసీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తిన కే.కేశవరావు. pic.twitter.com/M1CsUgEo3S

పార్టీ మారే విషయంలో తన తండ్రి కేశవరావు, సోదరి విజయలక్ష్మి తీసుకునే నిర్ణయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేకే కుమారుడు విప్లవ్‌ కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌లో చేరే విషయంపై వారు స్పష్టత ఇచ్చిన తర్వాతే, దానిపై తన అభిప్రా యం వెల్లడిస్తానని చెప్పారు. తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాను బీఆర్‌ఎస్‌కు గట్టి మద్దతుదారుడినని, కేసీఆర్‌ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కేసీఆర్‌ ప్రభు త్వంలో విప్లవ్‌కుమార్‌ తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేయడం తెలిసిందే.

కేసీఆర్‌తో భేటీ తర్వాత మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. ఇంద్రకరణ్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా ఇంద్రకరణ్‌రెడ్డి, అరవింద్‌రెడ్డితో పాటు కేకే కుమా ర్తె, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి ఈనెల 30న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం.

కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారు

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైంది. కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్‌ నేతల బృందం శుక్రవారం ఉదయం కడియం ఇంటికి వెళ్లింది. ఆ బృందంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీతో పాటు మల్లు రవి, సంపత్ కుమార్, రోహీన్ రెడ్డి ఉన్నారు. దాదాపు అరగంటకు పైగా కడియం నివాసంలో వీళ్లంతా సమావేశం అ‍య్యారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.

Here's Videos

కడియం శ్రీహరి, కావ్యలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాం.. వీళ్లు అధికారికంగా మా పార్టీలోకి చేరతారు అని ప్రకటించారు దీపాదాస్‌ మున్షీ. అలాగే.. ఏఐసీసీ ప్రతినిధిగా దీపాదాస్‌ తమను కలిశారని కడియం చెప్పారు. ఏఐసీసీ, పీసీసీ నన్ను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. నేను కాంగ్రెస్ లో ఇంకా చేరలేదు. నేను బీఆర్ఎస్ పార్టీ వీడడానికి చాలా కారణాలు ఉన్నాయి. వరంగల్‌ ఎంపీ అభ్యర్థి ఎవరనేది కూడా ఇంకా డిసైడ్‌ కాలేదు. అనుచరులు, అభిమానులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అని ఏఐసీసీ ప్రతినిధికి చెప్పా అని కడియం మీడియాతో అన్నారు.

మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రీ ఎంట్రీ వార్తలు

ఈ పరిస్థితులు ఇలా ఉంటే అసెంబ్లీ టికెట్‌ దక్కపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోబోతున్నట్లుగా సమాచారం.రాజయ్యతో హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ నేతలు టచ్‌లోకి వెళ్లారు. శనివారం సాయంత్రం రాజయ్య నేరుగా కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఒకవేళ కడియం శ్రీహరి వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే.. ఆయన మీద పోటీగా రాజయ్యను బరిలోకి దింపేందుకు బీఆర్‌ఎస్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్‌లో చేరలేదు. మరోవైపు ఆయన రాజీనామాను కూడా కేసీఆర్ ఆమోదించలేదు.మరోవైపు అనూహ్యంగా వరంగల్ ఎంపీ స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించారు. తండ్రితో కలిసి ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ తాజా నేపథ్యంలో తిరిగి రాజయ్య పేరు తెరపైకి వచ్చింది.

పార్టీ వీడే నేతలపై సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ధ్వజం

బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నాయ‌కుల‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు. పార్టీలు మారే వారిని ప‌వ‌ర్ బ్రోక‌ర్లుగా పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ అవకాశ వాదులు పార్టీని విడిచి వెళ్లిపోతున్నార‌ని, ఇదేం పార్టీకి కొత్తకాదని అన్నారు.తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 10 మంది కూడా పార్టీలో లేరని, అయినా కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం తెచ్చి చూపెట్టారని ప్రస్తావించారు.

ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పక్కన ఉన్న నాయకులను కాంగ్రెస్ వాళ్లు ఇలాగే కొన్నారని గుర్తు చేశారు. నాయకులను కాంగ్రెస్ కొనవచ్చు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తలను కొనలేరని అన్నారు. పార్టీలోకి మధ్యలో వచ్చిన వాళ్ళు పార్టీలోంచి వెళ్లిపోతున్నారని తెలిపారు. పోయినవారిని రేపు కాళ్ళు మొక్కిన మళ్ళీ పార్టీలోకి తీసుకోవద్దని పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు.

ఇది ఆకులు రాలే కాలమని, ఇప్పుడు అట్ల‌నే మ‌న పార్టీలో నుంచి కొన్ని ప‌నికిరాని ఆకులు చెత్త‌కుప్ప‌లో క‌లిసిపోతున్నాయని అన్నారు. ఆకులు పోయాక మ‌ళ్లీ కొత్త చిగురు వ‌చ్చి ఆ చెట్టు విక‌సిస్తుందన్నారు. కొన్ని ఆకులు పోయిన‌ట్టు కొంత‌మంది నాయ‌కులు పోవ‌చ్చని, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత‌కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంట‌దని తెలిపారు.

కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా వాళ్లను మళ్లీ పార్టీలో చేర్చుకోం: కేటీఆర్‌

కష్టకాలంలో బీఆర్‌ఎస్‌ వీడుతున్న వాళ్లు తిరిగొచ్చి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా మళ్లీ పార్టీలోకి రానివ్వమని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని అన్నారు. కానీ అధికారం పోగానే, తమ ప్రయోజనాల కోసం పార్టీ వదిలి ఇతర పార్టీలో చేరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు బీఆర్‌ఎస్‌ను వదిలి వెళ్తున్న వారు మళ్లీ పార్టీలో చేరుతామని కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా పార్టీలోకి రానివ్వమని చెప్పారు. వాళ్లకు తప్పకుండా బుద్ధి చెప్తామని అన్నారు.

పార్టీలో చెత్తంతా పోయింది: అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి

పార్టీలోని చెత్త అంతా పోయిందని.. గట్టి వాళ్లు మాత్రమే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి (pocharam srinivas reddy) స్పష్టం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా జోగిపేటలో ఆంధోల్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలపై ఆయన తీవ్రంగా స్పందించారు. పదవులు, అధికారం, వ్యాపారాల కోసం పార్టీలోకి వచ్చిన స్వార్ధపరులు, మోసకారులే ఈ విధంగా పార్టీ మారుతున్నారన్నారు. అయితే మోసకారుల జాబితా రాస్తే అందులో మొదటి పేరు బిబీ పాటిల్‌దేనని ఆయన స్పష్టం చేశారు. ఇక మొదటి నుంచి గులాబీ జెండా మోసిన నాయకులు, కార్యకర్తలు నేటికి బీఆర్ఎస్‌ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు.