Uzbekistan Child Deaths: దగ్గు మందు తాగి 18 మంది చిన్నారులు మృతి, మేడిన్ ఇండియా మందు తీసుకోవడం వల్లే చనిపోయారని ఉజ్బెకిస్తాన్ ఆరోపణ, వివరాలు కోరిన భారత్
ఉజ్బెకిస్తాన్లో సిరప్ తాగి 18 మంది చిన్నారులు మృతి (Uzbekistan Child Deaths) చెందారు. పిల్లల మరణానికి భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కారణమని ఉజ్బెకిస్తాన్ ఆరోపణలు గుప్పిస్తోంది.
New Delhi, Dec 29: ఉజ్బెకిస్తాన్లో సిరప్ తాగి 18 మంది చిన్నారులు మృతి (Uzbekistan Child Deaths) చెందారు. పిల్లల మరణానికి భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కారణమని ఉజ్బెకిస్తాన్ ఆరోపణలు గుప్పిస్తోంది. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 21 మంది పిల్లలలో 18 మంది ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ మారియన్ బయోటెక్ తయారు చేసిన డాక్-1 మాక్స్ దగ్గు మందు (Uzbekistan Child Deaths From India-Made Cough Syrup) తాగి పిల్లలు మృతిచెందారంటూ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
వైద్యుల సూచన లేకుండా అధిక మోతాదులో పిల్లలకు దగ్గు మందు ఇవ్వడం వల్లే ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కంపెనీ ఈ ఏడాదే ఉబ్జెకిస్తాన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 2012లో మారియన్ బయోటెక్ ఉజ్బెకిస్తాన్లో రిజిస్టర్ చేసుకుంది.సమాచారం మేరకు డోక్-1 మ్యాక్స్ సిరప్ ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించడం లేదు. ఈ సిరప్లపై నిర్వహించిన ల్యాబరేటరీ పరీక్షల్లో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ కనుగొన్నట్లు తెలిపింది.
ఈ ఘటనపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. ఉబ్జెకిస్తాన్ ప్రకటన తమ దృష్టికి వచ్చిందని.. ఘటనకు సంబంధించిన వివరాలను తమకు అందించాలని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖను భారత్ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో-నార్త్ జోన్), ఉత్తరప్రదేశ్ డ్రగ్స్ కంట్రోలింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ బృందాలు సంయుక్తంగా సదరు మందుల కంపెనీపై విచారణ ప్రారంభించాయి.
పిల్లలు ఆసుపత్రిలో చేరక ముందు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, తల్లిదండ్రులు లేదా ఫార్మసిస్ట్ల సలహా మేరకు అధిక మోతాదులో జలుబును తగ్గించేందుకు పిల్లలకు ఈ దగ్గు మందును అందించారు. 2.5- 5 ఎంఎల్ మోతాదుతో రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు 2-7 రోజుల పాటు ఈ సిరప్ను తీసుకున్నట్లు తేలింది. ఇది ప్రామాణిక మోతాదు కంటే ఎక్కువ’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 18 మంది పిల్లలు మరణించడంతో దేశంలోని అన్ని ఫార్మసీల నుంచి డాక్ -1 మాక్స్ టాబ్లెట్లు, సిరప్లపై నిషేధం విధించారు. ఈ సిరప్ను ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించడం లేదని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) వర్గాలు వెల్లడించాయి.
మారియన్ బయోటెక్ కంపెనీ వివరణ
ఉజ్బెకిస్తాన్లో పిల్లల మరణాల పట్ల చింతిస్తున్నామని మారియన్ బయోటెక్ ఫార్మా కంపెనీ పేర్కొంది. తయారీ యూనిట్ నుంచి దగ్గు మందు నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామని, నివేదికల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం విచారణ జరుపుతోందని, పూర్తి నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని కంపెనీ లీగల్ హెడ్ హసన్ రజా అన్నారు.
Here's ANI Tweet
We regret deaths, govt is conducting enquiry. We'll take action as per report. Samples were collected. Manufacturing of that product has been halted as of now & other processes are underway: Hasan Raza, Marion Biotech Pharma Company legal head on syrup deaths in Uzbekistan pic.twitter.com/UyOslJV7E2
— ANI (@ANI) December 29, 2022
భారత్లో తయారు చేసిన దగ్గు సిరప్లపై ఆరోపణలు రావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఇంతకుముందు ఆఫ్రికన్ దేశమైన గాంబియాలో 76 మందికి పైగా పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్లో తయారైన దగ్గు మందు సిరప్ కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. పిల్లల మృతిపై కంపెనీ సిరప్లకు సంబంధం ఉందని, వీటిని వాడవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఉబ్జెకిస్తాన్, గాంబియాలోనూ చిన్నారుల మరణాలకు సిరప్లో ప్రాణాంతక రసాయనం ఇథిలీన్ గ్లైకాల్ ఉండటమే కారణమని తేలింది.
(The above story first appeared on LatestLY on Dec 29, 2022 12:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

