Excessive Charges in TS: 5 లక్షలు కట్టి శవాన్ని తీసుకెళ్లమన్న ప్రైవేట్ ఆస్పత్రి, అధిక బిల్లులు వసూలు చేయడంపై మండిపడిన తెలంగాణ హైకోర్టు, పలు ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు జారీ
Coronavirus Outbreak. | (Photo-PTI)

Hyderabad, July 8: కరోనా (Coronavirus) విపత్కర పరిస్థితుల్లో తెలంగాణలో పలు ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తంచేసింది. కరోనాకు సంబంధించి అధిక బిల్లులు వసూలు (Excessive Charges in TS) చేయడంపై నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. కరోనా టెస్ట్‌లు‌, ఛార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది.ఎంత ఛార్జి వసూలు చేయాలో ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ ఆస్పత్రులు పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొంది. తెలంగాణలో 27 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1879 పాజిటివ్ కేసులు నమోదు

నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని భావిస్తున్నట్లు హైకోర్టు (Telangana High Court) విశ్వాసం వ్యక్తం చేసింది. ఒకవేళ ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో కోర్టుకు తెలపాలని, ఈ విషయమై ఈ నెల 14లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి (TS Govt) హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కరోనా చికిత్సలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో (private hospitals) ఛార్జీల వసూలుపై తెలంగాణ హైకోర్టులో న్యాయవాది కిషన్ శర్మ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు (Private Hospitals) చట్టాలను ఉలంఘిస్తున్నాయని, చర్యలు తీసుకోవాలని, ఇందుకు సరైన మర్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు.

డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ - 2005, క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ రిజిస్ట్రేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ - 2010, ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ కాండక్ట్‌ రెగ్యులేషన్స్‌ ప్రకారం ప్రైవేటు హాస్పిటల్స్‌లో పారదర్శకంగా చికిత్స, బిల్లింగ్‌ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఈ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ మేరకు కోవిడ్‌ 19 చికిత్స అందిస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్‌కు చట్టబద్ధమైన మార్గదర్శకాలు జారీచేయాలని విజ్ఞప్తిచేశారు. హైకోర్టు ఆదేశాలకనుగుణంగా 4 ప్రైవేటు హాస్పిటళ్లను పిటిషనర్‌ ప్రతివాదులుగా చేర్చారు. ఇరవై వేలు దాటిన కరోనా మరణాలు, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 22,752 కోవిడ్-19 కేసులు నమోదు, దేశంలో 7,42,417కి చేరిన మొత్తం కరోనా కేసుల సంఖ్య

ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. హైదరాబాద్‌ ఫీవర్‌ హాస్పిటల్‌ డీఎంవో సుల్తానాను నిర్బంధంపై ధర్మాసనం ఆరా తీసింది. కొవిడ్‌ -19 చికిత్సకు చార్జీలపై జీవోలో స్పష్టంగా ఉన్నప్పుడు అధిక బిల్లులు ఎలా వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ‘ప్రైవేటు హాస్పిటల్స్‌ జీవోకు విరుద్ధంగా బిల్లులు వసూలు చేస్తున్నాయి. అలాంటి హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకోవాలి.

ఒకవేళ తీసుకోకపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదో కారణాలు చెప్పాలి’ అని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌లను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేషనల్‌, స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌,పలు ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 14 వరకు కౌంటర్లు దాఖలుచేయాలని ఆదేశించింది. విచారణను ఈనెల 14కు వాయిదావేసింది.

ఈ పరిస్థితుల ఇలా ఉంటే.. సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ దవాఖానలో శవాన్ని తీసుకెళ్లాలంటే మిగిలిన మొత్తం 5 లక్షల కట్టి తీసుకువెళ్లాలని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో కొవిడ్‌-19తో చికిత్స పొందూతూ యాదగిరిగుట్టకు చెందిన ఓ వ్యక్తి మరణించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆస్పత్రి బిల్లు మొత్తం రూ. 12 లక్షలు అయింది.

అప్పటి వరకు చికిత్సకోసం రూ.7 లక్షలను బాధితుడి కు టుంబీకులు చెల్లించగా 5 లక్షల పెండింగ్ లో ఉండిపోయింది. కరోనాతో అతను చనిపోవడంతో మృతదేహాన్ని ఇవ్వాలంటే మరో రూ. 5 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది. దీంతో మృతుడి కుటుంబీకులు ఆందోళన చేశారు. చివరకు రూ. 20 వేలు కట్టించుకోని మృతదేహాన్ని అప్పగించగా.. ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారు.

ఇక సికింద్రాబాద్‌ గ్యాస్‌మండికి చెందిన ఓ వ్యక్తి (55) కరోనా లక్షణాలతో గత నెల 13న సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ ప్రాంతంలోని ఓ కార్పొరేట్‌ దవాఖానలో చేరాడు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఇన్సూరెన్స్‌తో కలుపుకొని రూ. 5 లక్షల బిల్లు చెల్లించారు. మొత్తం రూ. 13 లక్షల బిల్లు అయ్యిందని, ఇంకా రూ. 8 లక్షలు కట్టాలని దవాఖాన వారు ఒత్తిడి తెస్తున్నట్టు బాధితుడి కుటుంబీకులు తెలిపారు. డబ్బులు కట్టనందున రోగిని చూసేందుకు అనుమతించడం లేదని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు.