Crime: మరో వారంలో పెళ్లికాబోతున్న యువతిని అత్యాచారం చేసి, ఫోటోలు వీడియోలు కాబోయే వరుడికి పంపి, పైశాచిక ఆనందం, నిందితుల అరెస్ట్
Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

మరో రెండు వారాల్లో పెళ్లి కూతురు కాబోతున్న యువతిపై ఇద్దరు దుండగులు అత్యాచారం చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకంది. అంతేకాదు అత్యాచారం చేస్తున్న ఫొటోలు, వీడియోలు తీసి ఆ యువతికి కాబోయే పెళ్లికొడుకుకి వాట్సప్ ద్వారా పంపారు. ఈ నెల 5న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం కోత్లాబాద్‌కి చెందిన ఓ యువతి(20) ప్రతిరోజూ మహబూబ్‌నగర్‌కు వచ్చి దినసరి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే మల్కాపూర్‌కి చెందిన రాజేందర్‌రెడ్డి అలియాస్‌ రాజు కొత్లాబాద్‌ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

ప్రస్తుతం ఆమె తల్లిగారి ఇంటి వద్ద ఉండటంతో రాజు కూడా ప్రతిరోజూ కొత్లాబాద్‌ నుంచి బైక్‌పై మహబూబ్‌నగర్‌కు వచ్చి పెయింటింగ్‌ పని చేసేవాడు. ఈ క్రమంలో దినసరి కూలీగా పని చేసే అమ్మాయిని రాజు చాలాసార్లు బైక్‌పై ఎక్కించుకుని రావడంతో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈనెల 5న ఆ అమ్మాయి పని కోసం జిల్లాకేంద్రంలోని టీడీగుట్ట గేటు దగ్గరకు వచ్చింది. ఆరోజు పని దొరకకపోవడంతో రాజు అతని స్నేహితుడు, ఆంజనేయులు కలిసి ఆమె వద్దకు వెళ్లారు.

వేరే చోట పని ఇప్పిస్తామని చెప్పి బైక్‌పై ఎక్కించుకుని ఫతేపూర్‌ అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ ఆమెకు బలవంతంగా మద్యం తాగించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. రాజు అత్యాచారం చేసేటప్పుడు ఆంజనేయులు ఫొటోలు, వీడియోలు తీశాడు. విషయం బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారు. కాగా, ఈ నెల 18న ఆ అమ్మాయికి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లైంగిక దాడి ఫొటోలు, వీడియోలను సదరు పెళ్లికొడుకు వాట్సాప్‌కు పంపారు.

ఆ ఫొటోలను పెళ్లికొడుకు అమ్మాయి తల్లిదండ్రులకు చూపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై 2 రోజుల క్రితం అమ్మాయి, తల్లిదండ్రులు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి శుక్రవారం రాజు, ఆంజనేయులును అరెస్టు చేసి రిమాండ్‌ తరలించినట్లు వన్‌టౌన్‌ సీఐ రాజేశ్వర్‌గౌడ్‌ తెలిపారు.