India as an Emerging Global Power: చైనా తీరు ఆందోళనకరం, భారత్ మాకు ఎల్లప్పుడూ మిత్ర దేశమే, ప్రపంచ శక్తిగా భారత్ ఎదుగుతోంది, అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చిన అమెరికా
ఇండో–పసిఫిక్ లో భారత్ తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని అమెరికా ప్రకటించింది. ప్రపంచ శక్తిగా భారత్ ఎదగడాన్ని (India as an Emerging Global Power) స్వాగతిస్తున్నామంటూ బైడెన్ ప్రభుత్వం (Biden Administration) పేర్కొంది.
Washington, February 10: ఇండో–పసిఫిక్ లో భారత్ తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని అమెరికా ప్రకటించింది. ప్రపంచ శక్తిగా భారత్ ఎదగడాన్ని (India as an Emerging Global Power) స్వాగతిస్తున్నామంటూ బైడెన్ ప్రభుత్వం (Biden Administration) పేర్కొంది. ఇండో పసిఫిక్ భద్రతలో ( Indo-Pacific region) భారత్ ది చాలా కీలకమైన పాత్ర అని తెలిపింది. కాగా పొరుగు దేశాలతో చైనా వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో మిత్ర దేశాలకు ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని, అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చింది.
అదే విధంగా.. భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, ప్రతిష్టంభనకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. డ్రాగన్ దేశ వ్యవహారశైలి పట్ల తమ వైఖరిని తెలియజేశారు.
భారత్–అమెరికాలది అత్యంత విశాలమైన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం. అన్ని విధాలా రెండు దేశాల మధ్య సహకారం, బంధం మరింత బలపడేందుకు కృషి చేస్తాం. ఈ బలమైన బంధం మున్ముందూ కొనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పొరుగు దేశాలతో చైనా బెదిరింపు ధోరణి ఆందోళన కలిగిస్తోంది. మా స్నేహితులకు ఎల్లప్పుడూ మేం అండగానే ఉంటాం. మా భాగస్వాములతో కలిసి పనిచేస్తాం. భద్రతాపరమైన విషయాల్లో పరస్పర సమాచార మార్పిడితో మిత్ర దేశాలకు సహకారం అందిస్తామని తెలిపింది.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, భారత విదేశీ వ్యవహారా మంత్రి ఎస్ జైశంకర్ మధ్య జరిగిన సంభాషణ గురించి స్పందిస్తూ.. అమెరికా- భారత్ మధ్య దౌత్య సంబంధాలు మరింత బలపడేలా చర్యలు తీసుకుంటున్నామని నైస్ ప్రైడ్ తెలిపారు. అత్యున్నతస్థాయి చర్చల ద్వారా వివిధ అంశాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేలా సానుకూల వాతావరణ నెలకొంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
సాగు చట్టాల రద్దు డిమాండ్ తో రైతులు చేస్తున్న ఆందోళనలపై అడిగిన ప్రశ్నకూ ఆయన బదులిచ్చారు. భారత ప్రభుత్వంతో తాము మాట్లాడుతూనే ఉన్నామన్నారు. అత్యున్నత ప్రజాస్వామ్య విలువలున్న భారత్ లాంటి దేశం.. ఆ విలువలను కాపాడుతుందని ఆశిస్తున్నానన్నారు. కాగా, అంతర్జాతీయ భద్రతా మండలిలో భారత్ కు చోటు దక్కడంపై ప్రైస్ హర్షం వ్యక్తం చేశారు.
వాణిజ్య పరంగానూ భారత్ తో మంచి సంబంధాలున్నాయని ప్రైస్ గుర్తు చేశారు. 2019లో భారత్–అమెరికాల మధ్య వాణిజ్య విలువ 14,600 కోట్ల డాలర్లకు పెరిగిందన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ మాట్లాడారని ప్రైస్ చెప్పారు. మయన్మార్ లో సైనిక పాలన కూడా ప్రస్తావన వచ్చిందన్నారు. కొవిడ్, పర్యావరణ మార్పులపైనా చర్చించారని వెల్లడించారు.
కాగా గతేడాది జూన్లో తూర్పు లదాఖ్లోని గల్వాన్లోయలో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆర్మీ చొరబాటుకు ప్రయత్నించగా భారత్ దీటుగా బదులిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఆనాటి నుంచి ఎల్ఓసీ వెంబడి ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించగా, బలగాల ఉపసంహరణకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. కాగా ఇండో పసిఫిక్ ప్రాంతం, దక్షిణ సముద్ర జలాల్లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇక కొత్తగా కొలువుదీరిన బైడెన్ ప్రభుత్వం కూడా చైనా తీరుపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
(The above story first appeared on LatestLY on Feb 10, 2021 03:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

