Amar Jawan Jyoti Flame: అమర్ జవాన్ జ్యోతి ఆర్పివేతపై స్పష్టతనిచ్చిన కేంద్రం, కొంత భాగాన్ని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉండే జ్యోతిలో విలీనం చేస్తామని వెల్లడి
50 ఏళ్ళుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతిని (Amar Jawan Jyoti Flame) నేడు ఆర్పివేయనున్నట్లు జాతీయ మీడియాలో వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. జ్యోతిని పూర్తిగా ఆర్పివేయట్లేదని అందులో కొంత భాగాన్ని తీసుకెళ్లి జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉండే జ్యోతితో కలపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
New Delhi, January 21: 50 ఏళ్ళుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతిని (Amar Jawan Jyoti Flame) నేడు ఆర్పివేయనున్నట్లు జాతీయ మీడియాలో వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. జ్యోతిని పూర్తిగా ఆర్పివేయట్లేదని అందులో కొంత భాగాన్ని తీసుకెళ్లి జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉండే జ్యోతితో కలపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్-పాకిస్థాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో అమరులైన సైనికుల స్మారకార్థం ఈ అమర జవాన్ జ్యోతిని ఇండియా గేట్ (Amar Jawan Jyoti Flame at India Gate) వద్ద ఏర్పాటు చేశారు.
దేశ రాజధానిలోని ఇండియా గేట్ వద్ద ఉండే ఈ జ్యోతిని శుక్రవారం ఆర్పివేసి.. అక్కడికి 400 మీటర్ల దూరంలో ఉన్న 'జాతీయ యుద్ధ స్మారకం' (National War Memorial) వద్ద ఉండే జ్యోతితో కలిపివేయనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఈ రెండు జ్యోతులు నిర్విరామంగా వెలుగుతూ ఉండేలా చూడటం చాలా కష్టతరమనే అభిప్రాయం నేపథ్యంలో వీటిని కలపాలని కేంద్రం నిర్ణయించినట్లు జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతలు విచారం వ్యక్తం చేశారు.
మన ధీర సైనికుల గుర్తుగా వెలుగుతున్న జ్యోతిని నేడు ఆర్పివేస్తుండటం తీవ్ర విచారం కలిగిస్తోంది. కొంతమందికి దేశభక్తి, త్యాగనిరతి ఎన్నటికీ అర్థం కావు. మన సైనికుల కోసం అమర్ జవాన్ జ్యోతిని మేం మళ్లీ వెలిగిస్తావని రాహుల్ ట్వీట్ చేశారు. విపక్షాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు నేడు స్పష్టతనిచ్చాయి. ''అమర జవాన్ జ్యోతి గురించి అసత్య ప్రచారం జరుగుతోంది. జ్యోతిని ఆర్పివేయట్లేదు.
అందులోని కొంత భాగాన్ని జాతీయ యుద్ధ స్మారక జ్యోతితో కలుపుతున్నాం. ఇండియా గేట్ వద్ద ఉన్న ఈ స్మారకంపై 1971లో అమరులైన జవాన్ల పేర్లు లేవు. అయినప్పటికీ ఇక్కడ జ్యోతి వెలుగుతూ ఉండటం వారికిచ్చే నిజమైన నివాళి అనిపించుకోదు. అదే జాతీయ యుద్ధ స్మారకం వద్ద 1971 యుద్ధ అమరులతో పాటు అనేక మంది వీర జవాన్ల పేర్లను లిఖించారు. అక్కడే ఈ జ్యోతి కూడా వెలిగితేనే వారికి నిజమైన శ్రద్ధాంజలి ఘటించినట్లు అవుతుంది'' అని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.
1971లో భారత్-పాక్ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు గుర్తుగా ఇండియా గేట్ వద్ద స్మారకం నిర్మించారు. 1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమర్ జవాన్ జ్యోతిని వెలిగించారు. అయితే ఆ తర్వాత దేశ రాజధానిలో రూ.176కోట్లతో 40 ఎకరాల్లో జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. అక్కడ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన 25,942 మంది సైనికుల పేర్లను సువర్ణాక్షరాలతో గ్రానైట్ ఫలకాలపై లిఖించారు. 2019 ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత నుంచి ఇండియా గేట్ వద్ద జరిగే అన్ని సైనిక కార్యక్రమాలను జాతీయ యుద్ధ స్మారకం వద్దకు మార్చారు.
జాతీయ యుద్ధ స్మారకం ఇండియా గేట్కు సుమారు 500 మీటర్ల దూరంలో ఉంది. ఇండియా గేట్ ఎత్తు 42 మీటర్లు. మొదటి ప్రపంచ యుద్ధం (1914-18), మూడో ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధం (1919)లలో అమరులైన వేలాది మంది భారతీయ సైనికుల పేర్లను దీని మీద రాశారు. దీనిని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించింది.
మొదట్లో దీనివద్ద అమర జవాన్ జ్యోతి ఉండేది కాదు. భారత్-పాకిస్థాన్ యుద్ధంలో అమరులైన 3,843 మంది భారతీయ సైనికుల స్మారకార్థం అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ఈ జ్యోతిని ఏర్పాటు చేసింది. దీనిని ఇందిరా గాంధీ 1972 జనవరి 26న ఆవిష్కరించారు. భారతీయ దళాల అధిపతులు, విదేశీ నేతలు ఇక్కడ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు. గణతంత్ర దినోత్సవాలనాడు ప్రధాన మంత్రి అమర వీరులకు నివాళులర్పిస్తూ ఉంటారు.
జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్మించింది. భారత దేశ పరిరక్షణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన భారతీయ సైనికుల స్మారకార్థం దీనిని నిర్మించింది. 2019 ఫిబ్రవరిలో దీనిని ప్రారంభించారు. అనంతరం అమరులకు శ్రద్ధాంజలి ఘటించే అన్ని కార్యక్రమాలను ఇక్కడే నిర్వహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా అమరులకు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలను కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఈ స్మారకంపై 25,942 మంది అమర వీరుల పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించారు.
(The above story first appeared on LatestLY on Jan 21, 2022 02:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

