Case registered against former CM YS Jagan(X)

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో ప్రత్యక్షంగా హాజరయ్యారు. కోర్టు ఆవరణలోకి ప్రవేశించిన తర్వాత ఆయన కొద్ది సేపు వెయిటింగ్ రూంలో వేచిచూశారు. విచారణ ప్రక్రియ మొదలయ్యాక, కోర్టు సిబ్బంది ‘ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి’ అని పిలిచిన వెంటనే జగన్ కోర్ట్ హాల్‌లోకి వెళ్లి న్యాయమూర్తికి వినమ్రంగా నమస్కరించారు.

అనంతరం, జడ్జి సూచించిన ప్రకారం హాజరు రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే జడ్జి ఆయనను వెళ్లేందుకు అనుమతించారు. విచారణ సమయంలో జగన్‌ను న్యాయమూర్తి ఎటువంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టలేదు; కేవలం హాజరు నమోదు ప్రక్రియ మాత్రమే పూర్తయ్యింది. కేసుకు సంబంధించిన పిటిషన్లపై త్వరలో విచారణ కొనసాగనుంది.

ఇక, జగన్ తర్వాతి సారి కోర్టుకు ఎప్పుడు హాజరవ్వాలనేది న్యాయస్థానం త్వరలో నిర్ణయించనుంది. కోర్టు నుంచి బయటకు వచ్చిన సీఎం మాజీ జగన్ నేరుగా తన నివాసం లోటస్ పాండ్‌కి చేరుకున్నారు. అక్కడ ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో కూడగట్టుకున్నారు. అయితే లోటస్ పాండ్ లోపలికి కేవలం కొద్ది మంది ప్రముఖ నేతలను మాత్రమే అనుమతించినట్లు సమాచారం.

జగన్ ఈ నేతలతో సుమారు గంటన్నర పాటు వివిధ రాజకీయ, న్యాయ పరమైన అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు తెలిసింది. తెలంగాణ వైసీపీ కీలక నేతలు కూడా ఆయనను కలుసుకోవడానికి సమాయత్తమయ్యారు. అనంతరం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.