No Changes in Income Tax Rates: వేతన జీవులకు మోదీ సర్కారు ఊరట, ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలకు పెంపు, ఆదాయ పన్ను శ్లాబులలో ఎలాంటి మార్పు లేదని వెల్లడి
Income Tax Return (Representational Image; Photo Credit: Pixabay)

New Delhi, Feb 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వ చివరి బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ మధ్యంతర బడ్జెట్ లో (Interim Budget 2024) వేతన జీవులకు మోదీ సర్కారు ఊరట కల్పించింది. ఆదాయ పన్ను శ్లాబులలో మాత్రం ఎలాంటి మార్పులేదని (No Changes in Income Tax Rates) వివరించారు.ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ ప్రస్తుతం రూ.50 వేలు ఉండగా.. దీనిని రూ.75 వేలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) ప్రకటించారు.

ఏడాదికి రూ.7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటించారు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఈ మినహాయింపు వర్తిస్తుందని బడ్జెట్ స్పీచ్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఉద్యోగులను కొత్త పన్ను విధానం వైపు ప్రోత్సహించేందుకు ఈ మినహాయింపును ప్రకటించినట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వానికి పన్నుల ఆదాయం రూ.26.02 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

ఆదాయపు పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు లేవని తెలిపిన నిర్మల, రాష్ట్రాలకు 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణంగా రూ. 75,000 కోట్లు మంజూరు

ఇక కార్పొరేట్ పన్ను శాతం విషయానికి వస్తే.. ఇప్పటి వరకు కార్పొరేట్ ట్యాక్స్ 30 శాతం ఉండగా.. ఇకపై కార్పొరేట్ల నుంచి 22 శాతం ట్యాక్స్ వసూలు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష పన్నులు మూడు రెట్లు పెరగగా.. పరోక్ష పన్నుల్లో చెప్పుకోదగ్గ మార్పు లేదని మంత్రి వివరించారు. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ ఆదాయం రూ.30.08 లక్షల కోట్లు కాగా.. ద్రవ్యలోటు 5.8 శాతంగా ఉందని మంత్రి చెప్పారు. ఇక ఈ ఏడాది అప్పులు రూ. 14 లక్షల కోట్లు అని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్, విక్షిత్ భారత్ లక్ష్యం కోసం 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణంగా రూ.75,000 కోట్లు మంజూరు చేయనున్న కేంద్రం

మధ్యంతర బడ్జెట్ లో నిర్మల 58 నిమిషాల పాటు తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇంతవరకూ ఆమె ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లతో పోల్చుకుంటే అత్యంత తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగం ముగించడం ఇదే తొలిసారి. ఆర్థిక మంత్రి గత ప్రసంగాలను పరిశీలిస్తే, 2019లో 137 నిమిషాలు, 2020లో 162 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. 2021లో 110 నిమిషాలు, 2022లో 92 నిమిషాలు, 2023లో 87 నిమిషాల పాటు ఆమె ప్రసంగం సాగింది. ఈసారి (2024) తాత్కాలిక బడ్జెట్ కావడంతో 58 నిమిషాలతో ప్రసంగం ముగిసింది.

2019 జూలై నుంచి ఐదు సార్లు పూర్తి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో గత ఆర్థిక మంత్రులు మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హాల రికార్డులను ఆమె అధిగమించారు.