
Hyderabad, May 02: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Telangana elections) ముగియగానే తెలంగాణపై దృష్టిసారించనుంది కాంగ్రెస్ (Congress) పార్టీ. అక్కడ ప్రచారం పూర్తవగానే తెలంగాణలో ముఖ్యనేతలు పర్యటించనున్నారు. ఈ మేరకు కీలక నేతల పర్యటనలు ఖరారవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి సీఎం చైర్ను దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలు పాదయాత్రలు నిర్వహిస్తూ, జిల్లాల వారిగా సభలు నిర్వహిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి ముఖ్యనేతల పర్యటనలకు తోడు జాతీయ స్థాయి పార్టీ నేతలుసైతం రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో ఈనెల 8న కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సరూర్ నగర్లో నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీలో (Unemployment Rally) ఆమె పాల్గొని ప్రసంగించనున్నారు.
ప్రియాంకా గాంధీ మే5న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. తొలుత ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసినప్పటికీ.. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఆమె పర్యటన వాయిదా పడింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాహుల్ (Rahul), ప్రియాంకలు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ విస్తృతంగా పాల్గొంటున్నారు. ఈ నెల 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే దశలో జరుగుతుంది. ఈ క్రమంలో మే 8 నాటికి ప్రచారపర్వం ముగుస్తుంది. దీంతో ప్రియాంక గాంధీ కర్ణాటక రాష్ట్రంలో (Karnataka Elections) ప్రచారపర్వాన్ని ముగించుకొని నేరుగా తెలంగాణలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక నుంచి నేరుగా సరూర్ నగర్ లోని నిరుద్యోగ నిరసన ర్యాలీలో ఆమె పాల్గోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8న తెలంగాణ పర్యటనకు ప్రియాంక గాంధీ రానున్న నేపథ్యంలో ఆమె పర్యటనను విజయవంతం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించింది. ప్రియాంక గాంధీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై జూమ్ ద్వారా పార్టీ ముఖ్యనేతలతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సమావేశం కానున్నారు. సరూర్ నగర్ నిరుద్యోగ నిరసన సభకు ప్రియాంక గాంధీ వస్తున్న నేపథ్యంలో జిల్లాల వారిగా భారీ సంఖ్యలో పార్టీ శ్రేణుల తరలింపు, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.