Nayanatara (photo-X)

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం NBK111 నుంచి సినీ అభిమానులను ఉర్రూతలూగించే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో కథానాయికగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మంగళవారం (నవంబర్ 18) నయనతార పుట్టినరోజును పురస్కరించుకుని ఈ శుభవార్తను వెల్లడించారు.

ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని తన ఎక్స్ ఖాతా (X account) ద్వారా నయనతారకు ప్రత్యేక స్వాగతం పలికారు. క్వీన్ నయనతార గారికి NBK111 ప్రపంచంలోకి స్వాగతం. మా కథలో ఆమె శక్తి, గాంభీర్యం ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నాం. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మిమ్మల్ని త్వరలో సెట్‌లో కలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అని పోస్ట్ చేశారు. నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ కూడా నయనతారకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.

వీరసింహారెడ్డి వంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇదే కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఒక చారిత్రక ఇతివృత్తం (Historical backdrop)తో రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని సరికొత్త, శక్తివంతమైన అవతారంలో చూపించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాను నవంబర్ నెలలోనే లాంఛనంగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. షూటింగ్ కోసం ఇప్పటికే రాజస్థాన్‌లోని పలు అందమైన లొకేషన్లను చిత్ర యూనిట్ పరిశీలించింది. బాలయ్య, నయనతార కాంబినేషన్ మరోసారి మేజిక్ క్రియేట్ చేసి, ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.