New Delhi, NOV 30: రాజకీయ పార్టీలకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున పార్టీలకు వచ్చే విరాళాలు భారీగా పెరుగుతున్నాయి. ఇందులో బీజేపీకి భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. గడిచిన ఏడాదిలో బీజేపీకి రూ.614.53 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు తాజాగా వెల్లడైంది. బీజేపీతోపాటు పలు జాతీయ పార్టీలు తమ పార్టీకి వచ్చిన విరాళాల గురించిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించాయి. వివిధ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ప్రకారం.. దేశంలో 2021-22 కుగాను బీజేపీకి అత్యధికంగా రూ.614.53 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఇది ప్రతిపక్ష కాంగ్రెస్ విరాళాలకంటే ఆరు రెట్లు ఎక్కువ కావడం విశేషం. బీజేపీ తర్వాత రెండో స్థానంలో ఉంది కాంగ్రెస్. ఈ పార్టీకి 2021-22కుగాను రూ.95.46 కోట్ల విరాళాలు వచ్చాయి. ఆ తర్వాత రూ.44.54 కోట్ల విరాళాలతో ఆమ్ ఆద్మీ పార్టీ మూడో స్థానంలో నిలిచింది.
ఇదే కాలానికిగాను తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రూ.43 లక్షల విరాళాలు మాత్రమే వచ్చాయి. తర్వాత సీపీఎం రూ.10 కోట్లు విరాళంగా పొందింది. నిబంధనల ప్రకారం రూ.20,000 కంటే ఎక్కువ మొత్తం విరాళాలుగా వస్తే వాటి వివరాల్ని ఎన్నికల సంఘానికి సమర్పించాలి. బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.
ఇక కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం కూడా జాతీయ పార్టీలే. ఈ జాబితాలో కొత్తగా చేరింది ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రస్తుతం ఈ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. గోవాలో గుర్తింపు పొందిన పార్టీగా నిలిచింది. తాజాగా గుజరాత్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తోంది.