Coronavirus in india: కరోనా రోగులు వాసన ఎందుకు కోల్పోతున్నారు? దేశంలో తాజాగా 61,408 మందికి కరోనా, 31 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు, 57,542కి చేరిన మృతుల సంఖ్య
Coronavirus in India | File Image | (Photo Credits: PTI)

New Delhi, August 24: భారత్‌లో గత 24 గంటల్లో 61,408 మందికి కరోనా (Coronavirus in india) సోకింది. అదే సమయంలో 836 మంది మృతి చెందారని, 57,468 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 31,06,349 కు (Coronavirus Cases in India) చేరగా, మృతుల సంఖ్య మొత్తం 57,542 (Covid Deaths)పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 23,38,036 మంది కోలుకున్నారు.

‌దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో కొత్తగా 1,450 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. గత కొంత‌కాలంగా కరోనా కేసులు త‌క్కువ‌గా న‌మోద‌వుతూ వ‌స్తున్నాయి. ఇప్పుడు ఉన్న‌ట్టుండి కేసులు పెర‌గ‌డంతో ప్రజారోగ్య నిపుణులలో ఆందోళన నెల‌కొంది. మాస్కులు ధ‌రించ‌క‌పోవ‌డం, సామాజిక దూరానికి కట్టుబడి ఉండకపోవడం, మ‌రింత అన్‌లాక్ విధానాలే కేసులు పెరుగుద‌ల‌కు కార‌ణ‌మ‌ని వారు అంటున్నారు. కాగా ఢిల్లీ ఆరోగ్యశాఖ‌ మంత్రి సత్యేంద్ర మీడియాతో మాట్లాడుతూ కరోనా కేసుల న‌మోదులో హెచ్చుతగ్గులు ఉన్నాయని, దీనిని చూసి కోవిడ్ -19 వ్యాప్తిలో మార్పు ఉందని తేల్చడం సరికాద‌న్నారు. ప్ర‌స్తుతానికి ఢిల్లీలో కోవిడ్ -19 పరిస్థితి అదుపులో ఉంద‌ని, కరోనా రికవరీ రేటు, కేసులలో తగ్గుదలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌న్నారు.  భారతీయుల్లో కరోనాని తరిమేసే యాంటీబాడీలు ఎక్కువే

దేశంలో గడ‌చిన‌ 7 రోజుల్లో దేశవ్యాప్తంగా కొత్త‌గా 4.5 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే స‌మ‌యంలో 6,666 మంది క‌రోనాతో మృతిచెందారు. మీడియాకు అందిన గణాంకాల ప్రకారం గడ‌చిన‌ 7 రోజుల్లో అత్య‌ధికంగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కాగా దేశంలో కోవిడ్ రికవరీ రేటు 75 శాతానికి పెరిగింది. దేశంలో ప్రతిరోజూ 50 వేలకుపైగా బాధితులు కోలుకుంటున్నారని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

దేశంలో తొలి కేసు నుంచి లక్షకు చేరడానికి 110 రోజులు సమయం పట్టగా, లక్ష నుంచి 10 లక్షలు చేరడానికి 59 రోజులు పట్టింది. ఇక 10 లక్షలు నుంచి 20 లక్షలు చేరడానికి కేవలం 21 రోజులు పట్టగా 20 లక్షలు నుంచి 30 లక్షలు చేరడానికి 16 రోజులు పట్టింది.  కరోనాకు తోడయిన స్వైన్ ఫ్లూ, దేశంలో ఇప్పటివరకు 2,721 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు, తెలంగాణలో 443 కేసులు నమోదు, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిఫుణులు హెచ్చరిక

ఇదిలా ఉంటే మరో 73 రోజుల్లో తాము కరోనా టీకాను సిద్ధం చేయబోతున్నామని, భారతీయులందరికీ వ్యాక్సిన్‌ను ఉచితంగా సరఫరా చేయబోతున్నామని వస్తున్న వార్తలపై సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎస్‌ఐ) ఆదివారం స్పందించింది. ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, ఊహాజనితమని వెల్లడించింది.

దేశ విదేశాల్లో వివిధ సంస్థలు అభివృద్ధి చేస్తున్న టీకాలు ఏఏ దశల్లో ఉన్నాయో తెలుసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ వ్యాక్సిన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఐసీఎంఆర్‌ హెడ్‌ (అంటువ్యాధుల విభాగం) సమీరన్‌ పాండా తెలిపారు. వచ్చేవారం అందుబాటులోకి రానున్న ఈ వెబ్‌సైట్‌లో టీకాకు సంబంధించిన సమాచారం ఇంగ్లీష్‌తో పాటు పలు స్థానిక భాషల్లో కూడా అందుబాటులో లభించనున్నట్టు వెల్లడించారు.

నెలకు సగటున 60 లక్షల ‘స్పుత్నిక్‌-వీ’ టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు రష్యా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు ఆర్‌ఐఏ న్యూస్‌ ఏజెన్సీ ఓ నివేదికలో వెల్లడించింది. కొవిడ్‌-19 చికిత్సకు రష్యా తొలిసారిగా ఈ టీకాను ఇటీవల తీసుకురావడం తెలిసిందే. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల ఊపిరితిత్తుల్లోని కణాలపై వైరస్‌ ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నదన్న విషయాన్ని జర్మనీ శాస్త్రవేత్తలు డీకోడ్‌ చేశారు. దీని కోసం సరికొత్త ఎక్స్‌-రే సాంకేతికత సాయంతో త్రీ-డైమెన్షనల్‌ ఇమేజ్‌ను రూపొందించారు. ఈ వివరాలు ‘ఈలైఫ్‌' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

కరోనా సోకిన రోగులు వాసనను పసిగట్టే స్వభావాన్ని కోల్పోవడానికి గల కారణాల్ని తాజాగా పరిశోధకులు కనుగొన్నారు. వాసనను గుర్తించేందుకు సాయపడే ముక్కులోని కణాల్లో ఉండే ఎంజియోటెన్సిన్‌-కన్వర్టింగ్‌ ఎంజైమ్‌-II (ఏసీఈ-2) ద్వారానే వైరస్‌ శరీరంలోని కణజాలాల్లోకి ప్రవేశిస్తున్నదని, అందువల్లనే రోగులు వాసనను గుర్తించలేకపోతున్నారని వివరించారు. మరోవైపు, డెంగీ సోకిన వారికి చేసిన పరీక్షల్లో కరోనా సోకినట్టు కూడా కొన్నిసార్లు ఫలితాలు వస్తున్నాయని ఇజ్రాయెల్‌, సీఎస్‌ఐఆర్‌-ఐఐసీబీ శాస్త్రవేత్తలు చేసిన వేరువేరు పరిశోధనల్లో వెల్లడైంది. రెండు వ్యాధులకు కారణమైన వైరస్‌లకు మధ్య కొన్ని పోలికలు ఉండటమే దీనికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నట్టు చెప్పారు. అయితే, దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సిన అవసరమున్నదన్నారు.