Crude Oil Prices on Fire: రేపో, మాపో పెరుగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు, అంతర్జాతీయంగా మండిపోతున్న క్రూడాయిల్ ధర, పెంచాలా? వద్దా? అన్న మీమాంసలో కేంద్రం, ద్రవ్యోల్భణం మరింత పెరుగుతుందని భయం
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సాహసించడం లేదు. అలా పెంచితే రిటైల్ ద్రవ్యోల్బణం మరింత కోరలు చాస్తుందని భయపడుతోంది. ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరింది
New Delhi, June 13: క్రూడ్ మండుతోంది..! మరోసారి పెట్రోవాత (Petrol Price) తప్పదు..! తగ్గిన రేట్లు స్థిరంగా ఉంటున్నాయన్న ఆనందం ఇంకొన్ని రోజులు మాత్రమే..! ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి ముడిచమురు (Crude oil Price) ధరలు భగ్గుమంటున్నాయి. భారత్ కొనుగోలు చేసే క్రూడాయిల్ బ్యారల్ ధర పదేళ్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. ఒక్కో బ్యారల్ ధర 121 డాలర్లను దాటింది. ఒక దశలో ఇది 122.8 డాలర్లకు చేరినా తర్వాత కొద్దిగా దిగొచ్చింది. 2012 ఫిబ్రవరి, మార్చిలల్లో ఈ స్థాయిలో ధరలు నమోదవగా.. మరోసారి అదే రిపీట్ అయ్యింది. భారత్ కొనుగోలు చేసే క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ.. ప్రస్తుతానికైతే చమురు కంపెనీలు (Oil Companies) రెట్లు పెంచడంలేదు. అయితే ఇంకెంత కాలం ఈ భారాన్ని ప్రజలపై మోపకుండా కంపెనీలు ఉంటాయన్నదే డౌట్. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సాహసించడం లేదు. అలా పెంచితే రిటైల్ ద్రవ్యోల్బణం మరింత కోరలు చాస్తుందని భయపడుతోంది. ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా, దేశీయ మార్కెట్లో పెట్రో ధరలు పెంచితే రిటైల్ ద్రవ్యోల్బణం తొమ్మిది శాతానికి ఎగబాకుతుందనే అంచనాలు ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్పై నష్టాలను ఆయిల్ కంపెనీలు ఎంత కాలం భరించగలవన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.
బ్రెంట్ క్రూడ్ ధర ఆకాశాన్నంటే రీతిలో పైపైకి దూసుకుపోవడానికి చాలా కారణాలున్నాయి. రష్యా ముడిచమురు దిగుమతులపై నిషేధం విధించాలనే ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ సమర్థించడంతో క్రూడ్ ఆయిల్ ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారల్కు 120 డాలర్లు దాటడం ఆందోళన కలిగిస్తోంది. రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో పాటు చైనాలో కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ ఆంక్షలు సడలింపు వంటి పరిణామాలు క్రూడ్ ఆయిల్పై ప్రభావం చూపాయి. చైనాలో లాక్డౌన్ సడలిస్తే అది ముడి చమురు డిమాండ్ను పెంచుతుంది.
సరఫరా లేకపోవడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అటు మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు.. యుద్ధం, చైనా లాక్డౌన్ ప్రభావంతో అసలే రోజు రోజుకీ చమురు ధరలు చుక్కలను తాకుతుంటే.. లిబియాలో వేల బ్యారెళ్ల చమురు ఎడారి పాలవడం కష్టాలను మరింత పెంచేలా చేసింది. లిబియాలో ఎంతోకిలకమైన భూగర్భ పైపులైన్ దెబ్బతిన్నడంతో క్రూడ్ ధరల పెరగడానికి మరో ప్రధాన కారణం. ఇక అమెరికాలో గ్యాసోలిన్ ధర గ్యాలన్కు ఏకంగా 5డాలర్లు పెరగడం కూడా క్రూడ్ మంటలకు కారణంగా తెలుస్తోంది.
అటు ఇరాన్-అమెరికాల మధ్య న్యూక్లియర్ డీల్ కుదురుతుందా లేదా అన్న భయాలతో క్రూడ్ ధరలు పెరగినట్లు నిపుణులు చెబుతున్నారు. అటు ఒపెక్ దేశాల్లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి తగ్గడంతో పాటు కరోనా లాక్డౌన్ దాదాపుగా అన్ని దేశాల్లో లిఫ్ట్ చేయడంతో ప్రజల వాహనాల వాడకం పెరగడం కూడా క్రూడ్ ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం.
(The above story first appeared on LatestLY on Jun 13, 2022 12:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

