Privatisation of Banks: మిగిలేది 5 ప్రభుత్వ రంగ బ్యాంకులే, బ్యాంకుల ప్రైవేటీకరణ వైపు మోదీ సర్కారు చూపు, కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ కుదేల్
Employees Representational Image Photo Credit: PTI)

New Delhi, July 21: ప్రస్తుతం దేశంలో డజను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. అయితే రానున్న కాలంలో ఇవి అయిదు లేకుంటే నాలుగుగా అవతరించనున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు (PSB)ల్లో సగానికిపైగా బ్యాంకులను ప్రైవేటీకరించాలని (Privatisation of Banks) మోదీ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రాసెస్ లో భాగంగా తొలుత ఆరు బ్యాంకులను ప్రైవేటీకరించే అవకాశం ఉంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BOI), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (CBI), ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (IOB), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (BOM), యూకో బ్యాంక్‌ను వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు విక్రయించనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి వార్తలు అందుతున్నాయి. కరోనా కల్లోలం, కీలక నిర్ణయం తీసుకున్న ఆర్‌బిఐ, ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ ద్వారా రూ. 10 వేల కోట్ల ప్రభుత్వ బాండ్ల కొనుగోలు, మార్చి 20న ప్రారంభం

పీఎస్‌బీల్లో ప్రైవేటీకరణకు రంగం సిద్ధమవుతోందని ఈ మధ్య నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (CAE) కేవీ సుబ్రమణియన్‌ వెల్లడించారు. ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీలో భాగంగా వ్యూహాత్మక రంగాల్లోని ప్రభుత్వ కంపెనీల (PSU)ను ప్రైవేటీకరించాలని మోదీ సర్కారు (Modi Govt) నిర్ణయించింది. వ్యూహాత్మక రంగాల్లో గరిష్ఠంగా 4 పీఎస్‌యూలనే కొనసాగిస్తామని, మిగతా వాటిని ప్రైవేటుపరం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. వ్యూహాత్మకేతర రంగాల్లో అన్ని పీఎస్‌యూలను ప్రైవేటీకరించనున్నారు. ఇందులో భాగంగానే బ్యాంకింగ్‌ను వ్యూహాత్మక రంగాల జాబితాలో చేర్చనున్నట్లు సుబ్రమణియన్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం వ్యూహాత్మక రంగాలు, వ్యూహాత్మకేతర రంగాలను గుర్తించే పనిలో ఉంది. ఆర్బీఐ కీలక నిర్ణయం, మ్యూచువల్ ఫండ్ల కోసం రూ.50 వేల కోట్ల స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ, NBFCsలకు మారటోరియం విస్తరణపై బ్యాంకులదే తుది నిర్ణయం

ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగంలో ఇకపై విలీనాలు ఉండవని సమాచారం. ఇప్పుడు నిధుల సేకరణకు సర్కారు ముందున్న ఏకైక అవకాశం వాటాల విక్రయమేనని తెలుస్తోంది. కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ కుదేలై ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో కీలకేతర రంగాల్లోని ప్రభుత్వ సంస్థల్లో మెజారిటీ వాటాల విక్రయం ద్వారా భారీగా నిధులు సేకరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. గత ఏడాది మోదీ సర్కారు ఒకేసారి 10 పీఎస్‌బీల విలీనం ద్వారా 4 బడా ప్రభుత్వ బ్యాంకులను ఏర్పాటు చేసింది.

ఆ ప్రక్రియలో భాగంగానే యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (UBI)లో ఆంధ్రా బ్యాంక్‌ విలీనమైంది. ఇంకా విలీనం చేయని బ్యాంకులను ప్రైవేట్‌ పరం చేయాలని భావిస్తున్నట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణపై కసరత్తు జరుగుతున్నదని, ప్రణాళిక సిద్ధం కాగానే కేబినెట్‌ ఆమోదం కోసం పంపడం జరుగుతుందని ఆయన చెప్పారు. మన దేశంలో ఐదుకు మించి ప్రభుత్వ బ్యాంకులక్కర్లేదని పలు ప్రభుత్వ కమిటీలు, ఆర్‌బీఐ ఇప్పటికే సూచించిన సంగతి విదితమే.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొండి బకాయిలు (NPA) అతిపెద్ద సమస్యగా మారాయి. గత రెండేళ్లలో తగ్గుముఖం పడుతూ వచ్చిన ఎన్‌పీఏలు.. కరోనా సంక్షోభంతో మళ్లీ ఎగబాకవచ్చని బ్యాంకర్లు ఆందోళన చెందుతున్నారు. 2018 మార్చి చివరినాటికి 11.6 శాతానికి పెరిగిన బ్యాంకింగ్‌ రంగ ఎన్‌పీఏలు.. 2020 మార్చి నాటికి 8.5 శాతానికి తగ్గాయి. కరోనా దెబ్బకు 2021 మార్చి నాటికి 13-14 శాతానికి పెరగవచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌ అండ్‌ పీ హెచ్చరించింది.

లాక్‌డౌన్‌తో ఆదాయం కోల్పోయిన రుణగ్రహీతలకు ఊరట కల్పించేందుకు ఆర్‌బీఐ మారటోరియం (ఈఎంఐ చెల్లింపులకు విరామం) ప్రకటించింది. మార్చి నుంచి అమల్లోకి వచ్చిన మారటోరియం ఆగస్టు 31తో ముగియనుంది. మారటోరియం గడువు ముగిశాక ఈఎంఐ డిఫాల్ట్‌లు ఒక్కసారిగా పెరగవచ్చని, మారటోరియం ఎంచుకున్న రుణఖాతాల్లో చాలావరకు మొండి బకాయిలుగా మారే ప్రమాదం ఉందని బ్యాంకింగ్‌ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ తరుణంలో పీఎస్‌బీల ప్రైవేటీకరణ సాధ్యపడకపోవచ్చు. పరిస్థితులు కుదుటపడ్డాక వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రక్రియను మొదలుపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.