Ontimitta Ramalayam: ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం మూసివేత, భక్తులు లేకుండా ఏకాంతంగా కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు, మే 15 వరకు ఆలయం మూసివేస్తున్నట్లు ప్రకటించిన టీటీడీ
vontimitta kodandarama swamy alayam (Photo-Twitter/ Pragyata)

Ontimitta, April 21: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ( Sri Kodanda Rama Swamy temple) ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 నుంచి  30వ తేదీ వరకూ ఒంటిమిట్ట కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు (vontimitta kodandarama swamy alayam) ఏకాంతంగా జరగనున్నాయి. ఈనెల 26న సీతారాముల కళ్యాణం భక్తులు లేకుండానే జరగనుంది. కరోనా ప్రభావంతో బ్రహ్మోత్సవాలను టీటీడీ ఆలయానికే పరిమితం చేసిన సంగతి విదితమే. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న పుణ్యక్షేత్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

కొన్ని ఆలయాల్లో భక్తుల రాకపోకలపై నిషేధం విధిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. కరోనా వ్యాప్తి దష్ట్యా కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయం (Sri Kodanda Rama Swamy temple) మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. స్వామివారికి నిర్వహించే పూజా కార్యక్రమాలు భక్తులు లేకుండా పూర్తి ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం, పురావస్తు అధికారుల సమక్షంలో ఆలయానికి నోటీస్‌ అంటించారు. మే 15 వరకు ఆలయం మూసివేస్తున్నట్లు నోటీసులో తెలిపారు. కోదండరామాలయంతోపాటు కడప జిల్లాలోని మరో 15 ఆలయాలను అధికారులు మూసివేశారు. ఆలయం మూసివేతతో ఈ నెల 21 నుంచి జరగాల్సిన శ్రీరామనవమి ఉత్సవాలు మరో ఏడాది కూడా ఏకాంతంగా నిర్వహించనున్నారు.

భక్తులు లేకుండా భద్రాద్రి సీతారాముల కల్యాణం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు

ఏటా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆరుబయట నిర్వహించే రాములోరి కల్యాణోత్సవానికి సంబంధించి ఇప్పటికే టీటీడీ అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. సుమారు 2 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు దాదాపు 50 శాతంపైగానే పూర్తయ్యాయి. ప్రస్తుత నిర్ణయంతో మరోసారి రాములోరి కల్యాణం ఆలయంలో భక్తులు లేకుండా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

అటు కరోనా నేపథ్యంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటను కూడా క్లోజ్ చేశారు. నందలూరులోని శ్రీసౌమ్యనాథస్వామి ఆలయం మూసివేశారు. పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. దక్షిణకాశిగా పిలువబడే పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని మూసివేశారు.