
ఇంగ్లండ్ జట్టును ప్రముఖ వ్యాఖ్యాత, ఆ దేశ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ (Nasser Hussain Warns England) అలర్ట్ చేశాడు. మూడవ టెస్టులో 78 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడింది కదా అని టీమిండియాను తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో 36 పరుగులకే ఆలౌటై ఆ తర్వాత ఊహించని రీతిలో చెలరేగి, సిరీస్ కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. టీమిండియాను ఏమాత్రం తక్కువ అంచనా వేసినా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడకపోతే నాలుగవ టెస్టులో (IND vs ENG 4th Test 2021) విరాట్ కోహ్లి సేన దెబ్బ తిన్న పులిలా గర్జిస్తుందని, దీంతో సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంటుందని ఆయన (Nasser Hussain) వార్నింగ్ ఇచ్చాడు. ఘోర పరాజయాల అనంతరం ఎలా పుంజుకోవాలో టీమిండియాకు బాగా తెలుసని, దీనికి చరిత్రే సాక్షమని తెలిపాడు.
ఇక లార్డ్స్ టెస్ట్లో చిరస్మరణీ విజయాన్నందుకున్న టీమిండియా.. లీడ్స్ టెస్ట్లో 78 పరుగులకే ఆలౌటై, ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఫలితంగా 5 టెస్ట్ల సిరీస్ 1-1తో సమమైంది. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య ఓవల్ వేదికగా కీలకమైన నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.