Hyderabad, November 3: తెలంగాణలో నిన్న తగ్గిన కొవిడ్ కేసులు ఈరోజు దాదాపు రెట్టింపు స్థాయిలో పెరిగాయి. వైరస్ నిర్ధారణ పరీక్షలు కూడా రెట్టింపు స్థాయిలో నిర్వహించడం వల్ల కేసులు కూడా అదే మాదిరిగా పెరిగాయి. దీనిని బట్టి కొవిడ్ ఇంకా చాపకింద నీరులా ఉన్నట్టే అర్థమవుతోంది. అయితే రికవరీల సంఖ్య స్థిరంగా ఉండటం ఒక్కటే ఊరటనిచ్చే విషయం.
రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 45,021 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,536 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 617 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 43,94,330 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 242,506కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 281 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 92, మేడ్చల్ నుంచి 96, కొత్తగూడెం నుంచి అత్యధికంగా 123, పక్కనే ఖమ్మం నుంచి 97 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి
మరోవైపు గత 24 గంటల్లో మరో 03 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1351కు పెరిగింది.
అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 1421 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 223,413 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,742 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.