![](https://test1.latestly.com/wp-content/uploads/2020/04/Gandhi-Hospital-380x214.jpg)
Hyderabad, November 12: తెలంగాణలో కొవిడ్ తగ్గుముఖం పడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మరియు చుట్టుపక్కల, అదే విధంగా ఆంధ్రా సరిహద్దుకు ఆనుకొని ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలు మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు నమోదయ్యే కేసులు తక్కువగానే ఉంటుంన్నాయి. మరోవైపు రికవరీ అయ్యే వారి సంఖ్య స్థిరంగా ఉండటంతో ఆక్టివ్ కేసుల సంఖ్య కూడా కొద్దికొద్దిగా తగ్గుతూ గురువారం ఉదయం నాటికి 17 వేలకు చేరింది.
ఇక గత ఒక్కరోజులో నమోదైన కేసుల విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 40,603 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,015 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 377 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 47,70,004 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 254,666కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 172 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 97, రంగారెడ్డి నుంచి 98, అలాగే కొత్తగూడెం నుంచి 80 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/11/ts1-9.jpg)
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/11/ts2-9.jpg)
మరోవైపు గత 24 గంటల్లో మరో 3 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,393కు పెరిగింది.
అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 1716 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 235,950 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,323 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.