Hyderabad, November 13: తెలంగాణలో ప్రతిరోజు నమోదయ్యే కొవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి, తాజాగా వెయ్యి లోపే కేసులు నమోదుకాగా, 12 వందలకు పైగా కోలుకున్నారు, దీంతో రాష్ట్రంలో ఆక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 17 వేలకు తగ్గింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మినహా చాలా జిల్లాల్లో వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో ఒక్కోసారి అసలు కేసులేమి నమోదు కావడం లేదు, అయినప్పటికీ వైరస్ వ్యాప్తి ఇప్పటికీ కొనసాగుతుందన్నది వాస్తవం.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 42,163 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 977 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 391 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 48,12,167 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 255,663కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 169 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 85, రంగారెడ్డి నుంచి 66, అలాగే కొత్తగూడెం నుంచి 65 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
మరోవైపు గత 24 గంటల్లో మరో 4 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,397కు పెరిగింది.
అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 1222 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 237,172 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,094 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.