Devi Priya Passes Away: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ కన్నుమూత, సంతాపం తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు తదితరులు
Devi Priya Passes Away (Photo-Twitter)

HYD, Nov 21: ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత జర్నలిస్టు దేవిప్రియ (Devi Priya Passes Away) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో (NIMS hospital) చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కవిగా, పాత్రికేయుడిగా, సినీగేయ రచయితగా దేవీప్రియకు మంచిపేరుంది. "గాలిరంగు" కవిత్వానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.

గుంటూరు జిల్లా పల్నాడులోని ఓబులేశునిపల్లెలో జన్మించిన దేవిప్రియ సినీరంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి జర్నలిజంలో స్థిరపడ్డారు. ‘అమ్మ చెట్టు’ మొదలుకొని ‘గాలిరంగు’ వరకు మొత్తం 7 కవితా సంపుటాలను రచించారు. 40 ఏళ్లుగా కొనసాగిన తన రచనా ప్రస్థానంలో తెలుగు నుంచి ‘గాలిరంగు’కు (Gaali Rangu) సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న కవిగా గుర్తింపు పొందారు. దేవీప్రియ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. దేవీప్రియ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు... కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా దేవీప్రియ ఎంతో కృషి చేశారని కేసీఆర్‌ గుర్తుచేశారు. దేవీప్రియ సాహిత్య ప్రతిభకు "గాలిరంగు" రచన మచ్చుతునకగా వర్ణించారు.

దేవీప్రియ‌ మృతి పట్ల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేవీప్రియ మృతి సాహితీ రంగానికి తీరని లోటన్నారు. మెతుకు సీమతో ఆయనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంజీర రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన పలు సభల్లో పాల్గొని సామాజిక చైతన్యం కోసం ఎంతో కృషి చేశారన్నారు.

దేవీప్రియ‌ గ‌త కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఈ నెల 6న న‌గ‌రంలోని ఓ ద‌వాఖాన‌లో చేరారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఇవాళ ఉదయం 7.10 గంటలకు తుదిశ్వాస విడిచారు. సాహితీ లోకంలో దేవీప్రియగా గుర్తింపు పొందిన ఆయ‌న‌ అస‌లు పేరు షేక్‌ ఖాజా హుస్సేన్.