Hyderabad, November 11: తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి నియత్రణలోకి వస్తోంది. రెండు,మూడు జిల్లాలు మినహాయించి దాదాపు అన్ని జిల్లాల్లో కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. అయితే ఇది చలికాలం కాబట్టి మరింత జాగ్రత్త అవసరం, ఈ కాలంలో సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు కూడా కొవిడ్ లక్షణాలలో భాగమే. ఈ నేపథ్యంలో ఎవరికి కొవిడ్ సోకిందో, ఎవరిది సాధారణ జలుబో చెప్పలేని పరిస్థితి.
ఇక గత ఒక్కరోజులో నమోదైన కేసుల విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 44,635మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,196 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 555 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 47,29,401 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 253,651కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 192 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 101, రంగారెడ్డి నుంచి 121, అలాగే నల్గొండ నుంచి 89 మరియు కొత్తగూడెం నుంచి 81 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
మరోవైపు గత 24 గంటల్లో మరో 5 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,390కు పెరిగింది.
అలాగే, మంగళవారం సాయంత్రం వరకు మరో 1745 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 234,234 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,027 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.