Hyderabad, November 5: తెలంగాణలో కొవిడ్19 మళ్లీ విజృంభిస్తుంది, ఇటీవల కాలంగా పాజిటివ్ కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా నమోదవుతూవచ్చింది, అయితే ఈ వారంలో పరిస్థితులు తారుమారయ్యాయి. గత రెండు, మూడు రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా, ఈ మహమ్మారి నుంచి కోలుకునే వారి సంఖ్య తగ్గుతుండటం ఆందోళన కలిగించే విషయం. అయితే పరిస్థితులు ఇంకా అదుపులోనే ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కరోనా నిబంధనలు పాటిస్తే వైరస్ మరింత విస్తరించకుండా నియంత్రించవచ్చు.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 44,327 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,539 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 555 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 44,84,183 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 245,682కి చేరుకుంది.
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 285 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 102, రంగారెడ్డి నుంచి 123, కొత్తగూడెం నుంచి 82, పక్కనే ఖమ్మం నుంచి 78, అలాగే కరీంనగర్ నుంచి 86 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
మరోవైపు గత 24 గంటల్లో మరో 5 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,362కు పెరిగింది.
అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 978 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 225,664 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,656 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.