Chandrayaan 3 Update: చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో మరో విజయం, చంద్రుని కక్ష్య నుంచి భూకక్ష్య వైపు ప్రొపల్షన్‌ మాడ్యుల్‌, ఇస్రో ట్వీట్ ఇదిగో..
Chandrayaan 3. (Photo Credit: X@isro)

చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో భాగంగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా చంద్రయాన్‌-3లో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ను తాజాగా జాబిల్లి కక్ష్య నుంచి తిరిగి భూకక్ష్య వైపు మళ్లించినట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్టు అనుకున్న దాని కంటే అధిక ఫలితాలను భారత్‌కు అందించినట్లైంది. తాజాగా దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇస్రో ట్వీట్‌ చేసింది. కక్ష్య పొడిగింపు, ట్రాన్స్‌ ఎర్త్‌ ఇంజెక్షన్‌ విన్యాసాలతో దీనిని పూర్తిచేసినట్లు వెల్లడించింది.

చంద్రుడిపైకి తన డీఎన్ఏను పంపిస్తున్న అమెరికా రిటైర్డ్ ప్రొఫెసర్.. ఎందుకంటే?

చంద్రయాన్‌-3లో ల్యాండర్‌ మాడ్యుల్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ అని మూడు భాగాలు ఉన్న సంగతి విదితమే. ప్రొపల్షన్‌ మాడ్యుల్‌తో ల్యాండర్‌ మాడ్యుల్‌ అనుసంధానమై ఉంటుంది. ఇది వాహకనౌక నుంచి విడిపోయి, ల్యాండర్‌ మాడ్యుల్‌ను చంద్రుడికి 100 కి.మీ. సమీపం వరకు తీసుకెళ్లింది. ఆ తర్వాత ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యుల్‌ విడిపోయింది. ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ కొన్ని నెలల పాటు కక్ష్యలోనే ఉంది. దీనిలోని పరికరం సాయంతో సమాచారాన్ని సేకరించి శాస్త్రవేత్తలకు పంపింది.

Here's ISRO Tweet

ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ మార్గాన్ని ఇస్రో తెలివిగా ప్లాన్‌ చేయడంతో.. దాదాపు 100 కిలోల ఇంధనం సేవ్ అయింది. దీనిని వాడుకొని ఇది మరికొన్ని పరిశోధనలు పూర్తిచేసింది. అనంతరం చంద్రుడి కక్ష్య నుంచి దీని మార్గాన్ని భూకక్ష్య వైపు మళ్లించారు. దీనిపై ఉన్న SHAPE పేలోడ్‌ భూమిపై పరిశోధనలు నిర్వహించనుంది. ఇది 36,000 కిలోమీటర్ల ఎత్తులో భూమి జియో బెల్ట్‌లోకి ప్రవేశించే సమయంలో, దిగువ కక్ష్యలోకి వచ్చే సమయంలో ఉపగ్రహాలను ఢీకొనకుండా అక్టోబర్‌లోనే పక్కగా ప్లాన్‌ చేశారు.