Hyderabad, FEB 09: సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు. రకరకాల మోసాలతో అమాయకులను దోచుకుంటున్నారు. జనాల అమాయకత్వం, వీక్ నెస్ లు, అవసరాలు, అత్యాశను క్యాష్ చేసుకుంటున్నారు. కొత్త కొత్త తరహాలో చీటింగ్ చేస్తున్నారు. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సైబర్ క్రిమినల్స్ (Cyber Criminals) ఇప్పటికే పలు రంగాల ప్రముఖుల పేర్లతో మోసాలకు తెగబడ్డారు. వారి పేరు అడ్డం పెట్టుకుని డబ్బులు కొట్టేస్తున్నారు. తాజాగా సైబర్ క్రిమినల్స్ కన్ను టాలీవుడ్ ప్రముఖ హీరో మహేశ్ బాబు కూతురు సితారపై పడింది. ఇంకేముంది.. సితార (Sitara Ghattamaneni)పేరుతో సైబర్ మోసాలకు తెరలేపారు. నటుడు మహేశ్ బాబు (Mahesh Babu) కూతురు సితార పేరుతో అభిమానులకు ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపి నగదు కాజేస్తున్నారు కేటుగాళ్లు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కలకలం రేపింది.
ఈ విషయం మహేశ్ బాబు టీం దృష్టికి వెళ్లింది. వెంటనే వారు అలర్ట్ అయ్యారు. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే సైబర్ నేరగాళ్ళను గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అంతవరకు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అభిమానులు అప్రమత్తంగా ఉండాలని మహేశ్ బాబు టీమ్ కోరింది. సితార పేరుతో వచ్చే అనుమానాస్పద నోటిఫికేషన్స్ కు, రిక్వెస్టులకు స్పందించవద్దని అభిమానులకు సూచించింది టీమ్ మహేశ్. సైబర్ నేరాల పట్ల అలర్ట్ గా ఉండాలని చెప్పింది.