Diwali 2020: ఓ వైపు కాలుష్యం, మరోవైపు కరోనా, టపాకాయలు పేల్చవద్దని కోరిన ఢిల్లీ సీఎం, లక్ష్మి పూజల్లో పాల్గొనాలని హస్తిన ప్రజలకు పిలుపు
Arvind Kejriwal (Photo Credits: ANI)

New Delhi, November 5: దేశ రాజధాని ప్రజలు టపాకాయలను పేల్చకుండా (Don't Burst Crackers at Any Cost) లక్ష్మి పూజల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) పిలుపునిచ్చారు. రానున్న దీపావళికి ఇంటివద్దనే లక్ష్మీపూజలు చేసుకోవాలని తనతోపాటు తన మంత్రిమండలి సభ్యులు కూడా తమతమ ఇండ్లలోనే లక్ష్మీదేవి పూజ కార్యక్రమాలు ( Laxmi Puja ) జరుపుకోవాలని ఆయన సూచించారు. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా ప్రభుత్వంతో సహకరించాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

అలాగే, కొవిడ్-19 పరిస్థితి క్షీణిస్తున్నందున పటాకులు పేల్చవద్దని సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రజలను కోరారు. కేజ్రీవాల్ తన క్యాబినెట్ మంత్రులతో కలిసి నవంబర్ 14 రాత్రి 7:30 గంటలకు 'లక్ష్మి పూజ' చేపట్టనున్నట్టు చెప్పారు. గత ఏడాది దీపావళి సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం కన్నాట్ ప్లేస్‌లో లేజర్ షో వైభవంగా నిర్వహించింది. ఈసారి కూడా మేం దీపావళిని ఘనంగా జరుపుకుంటాం.

ఎట్టి పరిస్థితుల్లోనూ పటాకులు పేల్చం. రెండు కోట్ల మంది ప్రజలు లక్ష్మి పూజలు చేస్తారు. కాబట్టి అద్భుతమైన వాతావరణం, మంచి వైబ్‌లు ఉంటాయి. ఇది ప్రతి ఇళ్లు శ్రేయస్సుకు దారితీస్తుంది" అని కేజ్రీవాల్ చెప్పారు. ఈ కార్యక్రమం 7:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. బయటకు వెళ్లి టపాకాయలు పేల్చకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. కాలుష్యాన్ని నియంత్రిద్దాం.’’ అని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ పూజలో కేబినెట్ మంత్రులు కూడా పాల్గొంటారని, అందరూ కలిసి లక్ష్మి పూజలు నిర్వహిస్తే... ఓ సకారాత్మక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఢిల్లీలో ఒకే కాలంలో కరోనా కేసులు, కాలుష్యం రెండూ పెరిగిపోతున్నాయని, కాలుష్యం కారణంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.

ఢిల్లీలో మూడవ దశకు చేరుకున్న కరోనా, రోజు రోజుకు పెరుగుతున్న కేసులు, అలర్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, 4 లక్షలు దాటిన కేసులు

ప్రస్తుతం, ఢిల్లీ ప్రభుత్వం అటు వాతావరణం, ఇటు కొవిడ్‌-19 సమస్యలను ఎదుర్కొంటున్నదని, ఆప్ ప్రభుత్వం పరిస్థితిని పరిష్కరించడంలో ఎటువంటి అవకాశాన్ని వదిలివేయడం లేదని అన్నారు. వాయు కాలుష్యం పెరగడం వల్ల కొవిడ్‌-19 వ్యాప్తి జరిగే అవకాశాలు ఉన్నందున ఈ దీపావళికి పటాకులు పేల్చకుండా ఉండటం మంచిదని ప్రజలను కోరారు.

ఢిల్లీలో బుధవారం 6,800 కి పైగా కొవిడ్-19 కేసులతో కొత్త రికార్డు నమోదైంది. గురువారం ఉదయం పొగమంచు ఢిల్లీ, పరిసర ప్రాంతాలపై కప్పేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి వ్యవసాయ వ్యర్థాలను కాల్చిన పొగలు రావడంతో గాలి వేగం, ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నది. పంట వ్యర్థాలు దహనం చేయడం వల్ల కొవిడ్‌-19 పరిస్థితిని మరింత దిగజారుస్తుందని మీడియా సమావేశం సందర్భంగా కేజ్రీవాల్ పేర్కొన్నారు.