Second Wave in India: భారత్‌లో జూలై నాటికి సెకండ్ వేవ్ అదుపులోకి  రావొచ్చు! గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,76 లక్షల పాజిటివ్ కేసులు మరియు 3,874 కోవిడ్ మరణాలు నమోదు
Covid in India(Photo-PTI)

New Delhi, May 20: భారత్‌లో రోజూవారీ కోవిడ్ కేసులు నిన్నటికంటే ఈరోజు స్వల్పంగా పెరిగాయి. అయినపటికీ పరిస్థితులు మెల్లిమెల్లిగా కుదుటపడుతున్నాయి. మళ్లీ కోలుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఆక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన ఒక్కరోజులో కోవిడ్ మరణాలు కూడా తగ్గడం ఊరట కలిగించే విషయం.

చాలా రాష్ట్రాల్లో మే నెలాఖరు వరకు  లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.  జూలై చివరి నాటికి భారత్‌లో సెకండ్ వేవ్ నియంత్రణలోకి వస్తుందని కేంద్ర సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తల బృందం అంచనా వేసింది. ఇక మళ్లీ థర్డ్ వేవ్ రావడానికి కనీసం 6 నుంచి 8 నెలలు పట్టే అవకాశం ఉందని వారి నివేదికలో పేర్కొన్నారు.

గడిచిన భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 2,76,070 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,57,72,400 చేరింది. నిన్న ఒక్కరోజే 3,874 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,87,122కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,69,077 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,23,55,440 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 31,29,878 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 86.74%  మెరుగుపడగా,  ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 12.14 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.11% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

మే 19 నాటికి దేశవ్యాప్తంగా 32,23,56,187  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 20,55,010 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

అలాగే, కరోనా లక్షణాలు ఉన్న వారు మరియు కరోనా పాజిటివ్ గా నిర్ధారింపబడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారు మాత్రమే ర్యాపిడ్ ఆంటిజెన్ టెస్టులు చేసుకోవాలని ఐసీఎంఆర్ పేర్కొంది. అవసరం లేకున్నా కరోనా టెస్టులు చేసుకోవడం మంచిది కాదని ఐసీఎంఆర్ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో 45 ఏళ్ల పైబడిన వారికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ మాత్రమే పంపిణీ చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం 18-44 మధ్య వయసు వారికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ కొనసాగుతోంది.  దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 18.7 కోట్లు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 18,70,09,792 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.