Covid Updates: కరోనా వ్యాక్సిన్ ఖరీదు రూ. 210, దేశంలో తాజాగా 12,584 కరోనా కేసులు నమోదు, ఏపీలో 121 మందికి కోవిడ్ పాజిటివ్‌, ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం
Medical workers (Photo Credits: IANS)

New Delhi, January 12: దేశంలో గడిచిన 24గంటల్లో పాజిటివ్‌ కేసులు భారీగా తగ్గాయి. 24గంటల్లో 12,584 కరోనా కేసులు (Coronavirus) నమోదయ్యాయి. గతేడాది జూన్‌ తర్వాత అతి తక్కువగా పాజిటివ్‌ కేసులు రికార్డవడం ఇదే తొలిసారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,04,79,179కు (India’s COVID-19) పెరిగింది. తాజాగా 18,358 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,01,11,294 మంది డిశ్చార్జి అయ్యారని చెప్పింది.

కొత్తగా మరో 167 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,51,327కు పెరిగాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 1,04,79,179 ఉన్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. 24గంటల్లో 8,97,056 టెస్టులు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 18,26,52,887 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొవిడ్‌ వల్ల కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 121 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 885037కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2450 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 875456 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7131కు పెరిగింది.

వ్యాక్సిన్ తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తోంది, పుణే నుంచి వివిధ రాష్ట్రాలకు బయలుదేరిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌, ఈ నెల 16 నుంచి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం

పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఆక్స్‌ఫర్డ్‌ (కొవిషీల్డ్‌) వ్యాక్సిన్‌ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.210 చొప్పున 1.10 కోట్ల డోసుల కొనుగోలుకు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ఆరోగ్యశాఖ తరఫున కేరళలోని తిరువనంతపురం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ రంగ సంస్థ ‘హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌’ నుంచి ‘సీరమ్‌’కు ఆర్డరు అందింది. భారత ప్రభుత్వానికి టీకాల ప్రొక్యూరింగ్‌ ఏజెన్సీగా హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌ వ్యవహరిస్తోంది. ఈ డీల్‌ వివరాలను ‘సీరం’ కంపెనీ చైర్మన్‌ సైరస్‌ పూనావాలా ధ్రువీకరించారు.

వచ్చే వారం మరో పెద్ద ఆర్డరు రావచ్చు’’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి వయో వృద్ధుల రక్షణ కోసం కరోనా టీకాలను ప్రైవేటు ఆస్పత్రులు, ఫార్మసీలకు సమకూర్చే వెసులుబాటును కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఒక డోసు ధర రూ.200 మాత్రమేనని, రూ.10 వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో కలుపుకొని అది రూ.210కి చేరుతోందని ఆ కంపెనీ అధికారవర్గాలు తెలిపాయి.