Schools,Colleges Reopen: నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్, బస్సుల బంద్‌తో విద్యార్థుల్లో అయోమయం, బస్సు‌పాస్‌ల రెన్యువల్‌‌కు తీవ్ర ఇబ్బంది
Schools, colleges to reopen from today In telangana (Photo-Twitter)

Hyderabad, October 21: ఏకంగా 23 రోజుల దసరా సెలవుల తర్వాత విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోన్నాయి. పండుగలకు సెలవులకు వెళ్లిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టణాల్లోని స్కూళ్లు, కాలేజీలకు తిరిగి రానున్నారు. ఇప్పుడు బడి, కాలేజీలు ప్రారంభమయ్యే, వదిలే సమయానికి బస్సులు వస్తాయా!? వస్తే, వాటిలో పాస్‌లను అనుమతిస్తారా! అనే సందేహాలు ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి. ఎందుకంటే ఆర్టీసీ సమ్మె ఈ నెల 5 నుంచి ప్రారంభమైంది. దానికి ముందే గత నెల 28వ తేదీ నుంచే దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. కాబట్టి సమ్మె ప్రభావం విద్యార్థులపై కనిపించలేదు. దసరా సెలవుల తర్వాత ఈనెల 14వ తేదీ నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఆర్టీసీ సమ్మె దృష్ట్యా ప్రభుత్వం సెలవులను 19వ తేదీ వరకు పొడిగించింది. 20వ తేదీ ఆదివారం కాగా, 21వ తేదీ నుంచి తిరిగి విద్యా సంస్థలు పని చేయడం ప్రారంభిస్తాయి. ఇప్పటి వరకూ దసరా సెలవులు ఉండడంతో విద్యార్థులు బయటకు రాలేదు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటనేది అర్థం కాని విషయంలా మారింది.

ఇదిలా ఉంటే సోమవారం నుంచి సమ్మె తీవ్రత స్పష్టంగా కనిపించనుందనే సంకేతాలు వస్తున్నాయి. కార్మికులంతా సమ్మెను మరింతగా ముందుకు తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కార్మీక సంఘాలతో చర్చలు జరిపే ప్రతిపాదనలు ఏవీ కనిపించకపోవడంతో సమ్మె తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరమనే చెప్పాలి. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది ప్రతి రోజూ ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్నారు. ఒక్క హైస్కూల్‌ స్థాయిలోనే సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడి ప్రయాణం చేస్తున్నారు. ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ వంటి విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు మరో 10 లక్షల మంది ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలోనే, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురికాక తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇ

ఆర్టీసీ సమ్మె కారణంగా బస్‌ పాస్‌ల రెన్యువల్‌ కూడా జరగడం లేదు. ప్రతిరోజూ విద్యార్థులతోపాటు ఇతర వర్గాల ప్రజలు కూడా వివిధ రకాల బస్‌ పాస్‌లను తీసుకుంటున్నారు. ప్రతి నెలా వీటిని రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల పాస్‌లను ప్రతి మూడు నెలలకోసారి రెన్యువల్‌ చేసుకోవాలి. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా బస్‌ పాస్‌ల రెన్యువల్‌కు ఇబ్బంది కలుగుతోంది.

ఇదిలా ఉంటే విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నది. బస్సుల్లో పాస్‌లన్నీ చెల్లుబాటు అవుతాయని, బస్‌పాస్‌లున్న విద్యార్థులు టికెట్ తీసుకోరాదని, టికెట్ తీసుకోవాలని బలవంతం చేస్తే ఫిర్యాదుచేయాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. నేటి నుంచి విద్యాసంస్థల బస్సులు ప్రజా రవాణాకు తిరిగే అవకాశాలు లేకపోవడంతో ప్రైవేట్ బస్సులు, సెవెన్ సీటర్ ఆటోలు, ఇతర వాహనాల సంఖ్యను పెంచాలని మంత్రి పువ్వాడ ఆర్టీవోలకు ఆదేశాలిచ్చారు. ఆర్టీసీ పరిధిలోని గరుడ, రాజధాని ఏసీ బస్సులు మినహా.. ప్రతి బస్సును నిర్దేశించిన రూట్లలో నడపాలని.. పల్లె వెలుగు బస్సులను యథాతథంగా పాత తరహాలోనే తిప్పాలని డిపోల్లో షెడ్యూలును ఖరారుచేశారు.