
New Delhi, FEB 20: వాల్మార్ట్కు చెందిన ప్రముఖ ఫిన్టెక్ సంస్థ ఐపీఓకు (IPO) సిద్ధమవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లో (Stock market) లిస్ట్ అయ్యేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. 2023లో నిర్వహించిన ఫండింగ్ రౌండ్ ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉందని కంపెనీ తెలిపింది. తమ సేవలు ప్రారంభించి ఈ ఏడాదికి పదేళ్లు పూర్తి కావస్తోందని, ఈ నేపథ్యంలో ఐపీఓకు వస్తుండడం తమ సంస్థకు ఓ మైలురాయిగా భావిస్తున్నామని పేర్కొంది.
ఐపీఓ సన్నాహాల్లో భాగంగా ఫోన్పే (Phone Pe) 2022 డిసెంబర్లోనే తన హోల్డింగ్ కంపెనీని సింగపూర్ నుంచి భారత్కు తరలించింది. ఇందుకోసం భారత ప్రభుత్వానికి రూ.8వేల కోట్లు పన్ను కూడా చెల్లించింది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో 48 శాతం వాటాతో ఫోన్పే అగ్రగామిగా ఉంది. గూగుల్ పే 37 శాతం వాటాతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.5046 కోట్ల ఆదాయాన్ని, రూ.197 కోట్ల లాభాన్ని ఫోన్పే నమోదు చేసింది. ఫిన్టెక్ కంపెనీల్లో ఫోన్పేకు పోటీగా ఉన్న పేటీఎం 2021లో రూ.2150 వద్ద స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యింది. ప్రస్తుతం 64 శాతం నష్టంతో రూ.764 వద్ద ట్రేడవుతోంది.