CBN Calls Chief Pawan Kalyan: విశాఖలో హైడ్రామా! పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసిన చంద్రబాబు, పవన్ బస చేసిన హోటల్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు, ఉదయం నుంచి ఉద్రిక్తత, కార్యక్రమాలన్నీ వాయిదా!
Credit@ Janasena Twitter

Vishakhapatnam, OCT 16: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఫోన్ చేశారు. విశాఖలో పరిణామాలపై ఆరా తీశారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఖరిపై పవన్ తో మాట్లాడారు చంద్రబాబు. జనసేన (Janasena) నేతలపై కేసులు, అరెస్ట్ లను చంద్రబాబు ఖండించారు. పోలీసుల నోటీసులు, పార్టీ నేతల అరెస్ట్ (Arrest) అంశాలపై చంద్రబాబుకు వివరించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో పని చేస్తోందన్నారు. పవన్ కు నోటీసులు ఇవ్వడం సరికాదన్నారాయన. పవన్ పర్యటనపై ఆంక్షలు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చంద్రబాబు. విశాఖపట్నంలో నిన్న గర్జన కార్యక్రమం నిర్వహించగా, జనవాణి (Janavani) కార్యక్రమం కోసం పవన్ కల్యాణ్ నగరంలో అడుగుపెట్టడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఎయిర్ పోర్టులో (Airport) మంత్రులపై జనసైనికులు దాడికి పాల్పడ్డారంటూ వైసీపీ (YCP) పోలీసులకు ఫిర్యాదు చేయగా, జనసేన నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే.

ఆదివారం పవన్ కు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. విశాఖను వీడాలంటూ స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు పవన్ కల్యాణ్ కు ఫోన్ చేశారు. పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వ వైఖరిపై పవన్ తో మాట్లాడారు. వందలమంది జనసేన నేతలపై కేసులు పెట్టడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఓ పార్టీ అధ్యక్షుడికి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు ఉంటుందని, జనసేన జనవాణి కార్యక్రమాన్ని సమర్థించారు చంద్రబాబు. తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, తమ నేతల అరెస్టులు తదితర అంశాలపై చంద్రబాబుకు వివరించారు పవన్.

పవన్ కు సంఘీభావం ప్రకటించిన చంద్రబాబు, అధికార పక్షం పోలీసులతో పాలన చేయాలనుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతల కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. విపక్ష నేతలను దూషించడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు చంద్రబాబు. పార్టీల ప్రజాస్వామ్య హక్కును ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని పవన్ తో అన్నారు చంద్రబాబు. అటు, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు (Somu veerraju) కూడా పవన్ కల్యాణ్ కు ఫోన్ చేశారు. ప్రజా పోరాటాల్లో కలిసి నడిచేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా పవన్ ను కలిశారు.

పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా విశాఖపట్నంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో పవన్ తాను బస చేసిన హోటల్ (Hotel) వదిలి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ తాను ఉంటున్న నోవాటెల్ హోటల్ కిటికీలోంచి తన కోసం ఎదురు చూస్తున్న అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేశారు. మరోవైపు పవన్ ఫ్యాన్స్ భారీగా నోవాటెల్ హోటల్ దగ్గరకు చేరుకున్నారు. అటు పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు ఒక్కొక్కరిని బీచ్ రోడ్ నుంచి పంపించేస్తున్నారు.