Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల చదువులను ప్రోత్సహించడం, వారి భవిష్యత్తుకు బాటలు వేయడమే ధ్యేయంగా చేపట్టిన ‘తల్లికి వందనం’ పథకం రెండో ఏడాది నిధుల విడుదలకు సర్వం సిద్ధం చేసింది. పేద కుటుంబాలలోని విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో అమరావతి వేదికగా నేడు ఈ నగదు విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నగదు పంపిణీ నేటి నుండి ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుంది.
ఈ పథకం కింద అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు చొప్పున నేరుగా వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ విడతలో మొత్తం 67,47,190 మంది విద్యార్థులు లబ్ధి పొందనుండగా.. ప్రభుత్వం ఇందుకోసం రూ. 10,091 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ ఆర్థిక సాయం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఊరట లభించడమే కాకుండా, బడి ఈడు పిల్లలందరూ పాఠశాలలకు వెళ్లేలా దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి లభించిన తాజా అప్డేట్స్
పథకం నిబంధనల ప్రకారం ప్రభుత్వం కేటాయించే రూ. 15,000 మొత్తంలో, పాఠశాలలు, కళాశాలల మౌలిక వసతులు మరియు నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ. 2,000 మినహాయించి, మిగిలిన రూ. 13 వేలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
ఏపీ వెదర్ అప్డేట్, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం.. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక
ఇప్పటికే యూడైస్ (U-DISE) ద్వారా వివరాలు నమోదైన విద్యార్థుల కుటుంబాలకు నిధుల విడుదల ప్రారంభమైంది. ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా 1వ తరగతి నుంచి 9వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు, అర్హతలను పరిశీలించిన అనంతరం ఆగస్టు 30నసహాయాన్ని అందించనున్నారు.
ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ద్వారా ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి మొత్తం రూ. 10,120.78 కోట్ల పరిపాలనా ముందస్తు మంజూరు ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి అంగన్వాడీ కార్యకర్తల పిల్లలను కూడా ఈ పథకం పరిధికి విస్తరించి ప్రయోజనం చేకూరుస్తున్నారు. తల్లులు, విద్యార్థులు తమ అప్లికేషన్ స్టేటస్ను 'మనమిత్ర' వాట్సాప్ సేవలు, 'లీప్' (LEAP) యాప్ లేదా గ్రామ/వార్డు సచివాలయాల జాబితాల ద్వారా సులభంగా సరిచూసుకోవచ్చు.