GHMC Elections: నవంబర్ లేక డిసెంబర్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు, త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి
Telangana State Election commissioner parthasarathi (Photo-FB)

Hyderabad, Oct 7: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు (GHMC Elections) నవంబర్‌, డిసెంబర్‌లో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి (State Election commissioner parthasarathy) ప్రకటించారు. బుధవారం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరపనున్నట్టు స్పష్టం చేశారు.

ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. కొవిడ్-19 నేపథ్యంలోబ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అలాగే మున్సిపల్‌ ఎన్నికలు కూడా బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని మెజార్టీ పార్టీలు కూడా మొగ్గు చూపాయి. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దుబ్బాక ఉప ఎన్నికలు నవంబర్ 3న జరుగుతున్న విషయం విదితమే. ఈ ఎన్నిలకు నియమావళిని కూడా ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.