Liquor Prices Hike: మందుబాబులకు తెలంగాణ సర్కార్ కానుక, రాష్ట్రంలో మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం, అన్ని రకాల మద్యంపై సుమారు 20 శాతం ధరల పెంపు, అమలు ఎప్పుట్నించో తెలుసుకోండి
Liquor Prices Revised in TS | Image used for representational purpose only | Photo- Pixabay

Hyderabad, December 16: నూతన సంవత్సర వేడుకలు దగ్గర పడుతుండటంతో అందరికటే ముందస్తు ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖ ( Telangana Excise) చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం ధరలను సుమారు 10 నుంచి 20 శాతం వరకు పెంచేసింది.  ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ. 400 కోట్లు అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా.

ఈ ధరల పెంపు (liquor prices hike) అన్ని రకాల మద్య పానీయాలకు వర్తిస్తుంది. బీరుపై రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంపు, ఇక మిగతా రకాల మద్యంపై ఆయా బ్రాండ్లను బట్టి రూ. 20 నుంచి గరిష్టంగా రూ. 100 వరకు పెంచారు. సాధారణ మద్యం 90 ml పై  రూ. 10, క్వార్టర్ బాటిల్‌పై రూ.20, హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ. 80 మరియు లీటర్ బాటిల్‌పై రూ. 100 అదనంగా వసూలు చేయనున్నారు.

పెరిగిన ధరలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ (Somesh Kumar)  సోమవారం నూతన ధరల పట్టికను విడుదల చేశారు. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమలులోకి వస్తాయని తెలిపారు. కాగా, ఈ ధరల పెంపు పాత స్టాక్‌కు వర్తించదని, డిసెంబర్ 16 నుంచి వచ్చిన స్టాక్‌కు సవరించిన రేట్లు వర్తిస్తాయని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.  పాత స్టాక్‌తో కొత్త స్టాక్‌ను కలపవద్దని మద్యం వ్యాపారస్తులకు ఆదేశాలు జారీచేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.