Telangana Pending Bills Case: సుప్రీంకోర్టులో కొలిక్కి వచ్చిన తెలంగాణ సర్కార్, గవర్నర్ పంచాయితీ, గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లులు లేనందున కేసును ముగిస్తున్నామని తెలిపిన ధర్మాసనం
తెలంగాణ గవర్నర్ తమిళసై బిల్లులను పెండింగ్ పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. గవర్నర్ తరఫున సొలిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఎలాంటి బిల్లులు లేవని, కొన్ని బిల్లులను తిప్పి పంపారంటూ సొలిటర్ జనరల్ తెలిపారు
Hyd, April 24: తెలంగాణ గవర్నర్ తమిళసై బిల్లులను పెండింగ్ పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. గవర్నర్ తరఫున సొలిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఎలాంటి బిల్లులు లేవని, కొన్ని బిల్లులను తిప్పి పంపారంటూ సొలిటర్ జనరల్ తెలిపారు. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రజలచే ఎన్నికల ప్రభుత్వం గవర్నర్ దయకోసం చూడాల్సి వస్తోందన్నారు.
ఇరువైపులా వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం బిల్లులను వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించింది. కేసును ముగిస్తూ.. బిల్లుల విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 200(1) ప్రకారం సాధ్యమైనంత త్వరగా అనే అంశం ప్రాధాన్యతను గవర్నర్లు గుర్తించాలని సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్లో పెట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విషయంలో కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు.. గవర్నర్కు నోటీసులు జారీ చేస్తామని చెప్పింది. అయితే, సమస్య ఏంటో తెలుసుకుంటామని ఎస్జీ తుషార్ మెహత కోర్టుకు తెలిపారు.విచారణ సందర్భంగా తమవద్ద ఏ బిల్లులు పెండింగ్లో లేవని గవర్నర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. రెండు బిల్లుల విషయంలో ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం, క్లారిఫికేషన్ కోరినట్లు పేర్కొన్నారు.
కాగా కీలక బిల్లులను తిప్పి పంపారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎన్నికైన చట్ట సభల ప్రతినిధులు గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు. బిల్లులు తిప్పి పంపాలంటే వీలైనంత వెంటనే పంపొచ్చని, కానీ తన వద్దనే పెండింగులో పెట్టుకోవడం సమంజసం కాదని రాష్ట్ర ప్రభుత్వ తరపు లాయర్ పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్లో ఒక వారంలో, గుజరాత్లో ఒక నెలలో బిల్లులన్నీ క్లియర్ అవుతున్నాయన్న విషయాన్ని కోర్టుకు తెలిపారు. గవర్నర్లు కూడా రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలని సూచించారు. గవర్నర్లు నిర్ణీత కాలవ్యవధిలోగా బిల్లులపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. వివరణ కోసం గవర్నర్ బిల్లులు తిప్పి పంపే అధికారం ఉందని స్పష్టం చేసింది. అయినా ప్రస్తుతం గవర్నర్ వద్ద ఏదీ పెండింగులో లేదని తెలిపింది. అయితే రాజ్యంగంలోని 200(1)వ అధికరణను గవర్నర్లు దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
(The above story first appeared on LatestLY on Apr 24, 2023 09:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

