![](https://test1.latestly.com/wp-content/uploads/2020/09/COV-380x214.jpg)
Hyderabad, October 12: తెలంగాణలో కరోనావైరస్ తగ్గుముఖం పట్టింది. ఇటీవల కాలంగా కొత్తగా నమోదవుతున్న కేసులను గమనిస్తే స్థిరమైన తగ్గుదల కనిపిస్తుంది, అలాగే దీని నుండి రికవరీ అవుతున్న వారి సంఖ్య పెర్రుగుతోంది. అయినప్పటికీ ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే వ్యాధి కాబట్టి ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 30,210 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1021 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 628 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,13,084కి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 35,77,261 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 228 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 68, మేడ్చల్ నుంచి 84 కేసులు నిర్ధారణయ్యాయి.
ఇక మిగతా జిల్లాల్లో కూడా కేసులు తగ్గాయి, అయితే వారాంతంలో నిర్వహించే టెస్టుల సంఖ్య కూడా తక్కువగా ఉంటుండటం కేసుల సంఖ్య తగ్గటానికి కారణమవుతుంది. తెలంగాణలో కొవిడ్ పరిస్థితి ఎలా ఉందో కింద హెల్త్ బులెటిన్లో గమనించవచ్చు.
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/10/ts1-6.jpg)
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/10/ts2-6.jpg)
మరోవైపు గత 24 గంటల్లో మరో 6 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1228కు పెరిగింది.
అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 2214 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,87,342 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,514 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.