COVID19 in India: భారత్‌లో 4 లక్షలు దాటిన కోవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో అత్యధికంగా 15,413 కేసులు నమోదు, కోవిడ్ చికిత్సకు 'ఫాబిఫ్లూ' ఔషధం సిద్ధం చేసిన గ్లెన్‌మార్క్ సంస్థ
Coronavirus Outbreak (Photo Credits: IANS)

New Delhi, June 21:  భారతదేశంలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 4 లక్షలు దాటింది. ఒకరోజును మించి మరొకరోజు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటమే ఇందుకు కారణం.  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 15,413  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.  దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 4,10,461 కు చేరింది. నిన్న ఒక్కరోజే 306 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 13, 254 కు పెరిగింది.

అయితే గత 25 గంటల్లో అత్యధికంగా దేశవ్యాప్తంగా 13,919 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,27,755 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 1,69,451 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

COVID19 Update:

 

మరోవైపు, రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో భయాందోళనలో ఉన్న ప్రజలకు ఒక పెద్ద ఊరటనిచ్చేలా కోవిడ్‌-19 చికిత్సకు ఔషధం తయారు చేసినట్టు భారత్‌కు చెందిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీ ప్రకటించింది. ‘ఫవిపిరవర్‌’ అనే యాంటీ వైరల్‌ డ్రగ్ కరోనా‌ చికిత్సకు బాగా పనిచేస్తోందని, దీనిని ‘ఫాబిఫ్లూ’ అనే బ్రాండ్‌ పేరు‌తో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్‌ సంస్థ తెలిపింది.

నోటి ద్వారా తీసుకునే ఈ టాబ్లెట్స్ తేలికపాటి మరియు ఓ మోస్తరు లక్షణాలుండే వ్యాధిగ్రస్తులపై నాలుగు రోజుల్లోనే ప్రభావం చూపిస్తుందని సంస్థ పేర్కొంది.

తాము చేసిన క్లినికల్‌ ట్రయల్స్‌లో ఫవిపిరవర్‌ మందు రోగులపై బాగా పనిచేస్తోందని గ్లెన్‌మార్క్‌ చైర్మన్, ఎండీ గ్లెన్‌ సల్దాన్హా తెలిపారు. తమ ఔషధాన్ని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) కూడా ఆమోదించినట్టు వెల్లడించారు.

కోవిడ్‌ చికిత్స కోసం భారత ప్రభుత్వం అనుమతించిన మొట్టమొదటి ఓరల్‌ ఔషధం ఫాబీఫ్లూ అని, దేశవ్యాప్తంగా ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తాము కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు గ్లెన్‌మార్క్‌ చైర్మన్‌ గ్లెన్‌ సల్దాన్హా స్పష్టం చేశారు.