India's COVID Report: భారత్‌లో కొత్తగా 38,949 కోవిడ్ కేసులు మరియు 542 మరణాలు నమోదు, నిన్నటితో పోలిస్తే తగ్గిన పాజిటివ్ కేసులు; గడిచిన ఒక్కరోజుల్లో మరో 40,026 మంది రికవరీ
COVID19 Outbreak | File Photo

New Delhi, July 16: భారత్‌లో రోజూవారీ కోవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి, నిన్న దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగగా, శుక్రవారం నాటి రిపోర్ట్ ప్రకారం సుమారు 3 వేల వరకు తగ్గాయి. ఈ వారం మొత్తం కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే దిగువలోనే ఉండటం ఊరటనిచ్చే విషయం, ప్రస్తుతం కోవిడ్ పాజిటివిటీ రేటు 2.14 శాతానికి పడిపోయింది. ఇక మరణాలు ఇంచుమించుగా 5-6 వందల మధ్య నమోదవుతున్నాయి. ఇటీవల కాలంగా మరణాల రేటు స్థిరంగా కొనసాగుతోంది.

ఇక దేశంలోని పలు రాష్ట్రాలు రాకపోకలకు సంబంధించి నిబంధనలు సడలిస్తున్నాయి. రెండు వ్యాక్సిన్ డోసులు వేసుకున్న వారికి మహారాష్ట్రలో కోవిడ్ ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ అవసరం లేదు.

గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 38,949 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,26,829 చేరింది. నిన్న ఒక్కరోజే 542 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,12,531 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 40,026 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,01,83,876 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,30,422 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.28% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.39 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.33% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా 44,00,23,239 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 19,55,910 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 38,78,078 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 39.53 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 39,53,43,767 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 31.61 కోట్లు ఉండగా, 7.92 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు