India Coronavirus: ముంచుకొస్తున్న సెకండ్ వేవ్ ముప్పు, కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, డిసెంబర్ 1 నుంచి అమల్లోకి, దేశంలో తాజాగా 44,489 మందికి కరోనా పాజిటివ్
Lockdown in India | (Photo Credits: PTI)

New Delhi, November 26: దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 44,489 మందికి కరోనా (Coronavirus Pandemic) నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 92,66,706 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 36,367 మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 524 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,35,223 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 86,79,138 మంది కోలుకున్నారు. 4,52,344 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

కోవిడ్ సెకండ్ వేవ్ (Coronavirus Second Wave) ముంచుకొస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను (new guidelines) రూపొందించింది. ఇప్పటికే ఉత్తరాదిలో అమలవుతున్న ఈ నిబంధనలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కచ్చితంగా పాటించాల్సిందేనని ఆదేశించింది. కోవిడ్ సంక్రమణను ఆపేందుకు జన సమర్ధక ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నియంత్రించాలని, పాజిటివ్‌ కేసుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ పెంచాలని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ (Ministry of Home Affairs) సూచించింది. కొన్ని ప్రాంతాలలో కరోనా పాజిటివ్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో కోవిడ్‌–19 సంక్రమణను తనిఖీ చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రాత్రిపూట కర్ఫ్యూ వంటి ఆంక్షలను స్థానికంగా విధించుకోవచ్చని తెలిపింది.

కరోనా రోగుల్ని గుర్తిస్తున్న శునకాలు, ఢిల్లీలో ఆగని కరోనా కల్లోలం, రష్యా స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌పై కొత్త ఆశలు, దేశంలో 92 లక్షలు దాటిన కరోనా కేసులు

అయితే కంటైన్మెంట్‌ జోన్‌ బయట లాక్డౌన్‌ విధించే ముందు మాత్రం రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదించాలని స్పష్టం చేసింది. మార్గదర్శకాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలను ప్రజలు కచ్చితంగా పాటించేలా స్థానిక జిల్లా, పోలీసు, మునిసిపల్‌ అధికారులు బాధ్యత వహించాలని కేంద్రం ఆదేశించింది. డిసెంబరు 1 నుంచి ఇవి అమలవుతాయని తెలిపింది.

మాస్క్‌లు, భౌతికదూరం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించనివారికి తగిన జరిమానా విధించాలని మార్గదర్శకాల్లో స్పష్టంగా ఆదేశించింది. వైరస్‌ సంక్రమణ కట్టడికి కార్యాలయాల్లోనూ మాస్క్‌లు ధరించని వ్యక్తులకు జరిమానాలు విధించాలని తెలిపింది. ఆరోగ్య సేతు యాప్‌ను విధిగా అందరూ వినియోగించాలని సూచించింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల 50 శాతం కెపాసిటీతో సినిమా థియేటర్ల కార్యకలాపాలకు అనుమతి ఇచ్చిన కేంద్రం, స్విమ్మింగ్‌ పూల్స్‌కు అనుమతిని క్రీడాకారుల శిక్షణ నిమిత్తం మాత్రమే ఇచ్చింది. ఆధ్యాత్మిక, సామాజిక, క్రీడ, వినోద, విద్య , సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య , వారు హాజరైన వేదిక సామర్థ్యంలో 50 శాతానికి మించకూడదని తెలిపింది.మార్కెట్లు, వారాంతపు సంతలకు నియమాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలో జారీ చేయనుంది.

పాజిటివ్‌ కేసును గుర్తించిన తర్వాత వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారి వివరాలను సేకరించటంతో పాటు, వారిని గుర్తించటం, క్వారంటైన్‌ చేయటం వంటి పనులన్నింటినీ 72 గంటల్లో కనీసం 80శాతం పూర్తి చేయాలని సూచించింది. అంతేగాక కోవిడ్‌–19 రోగులకు వెంటనే హోం ఐసోలేషన్‌ నిబంధనలను పాటిస్తూ చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సూక్ష్మ స్థాయిలో, జిల్లా అధికారులు కంటైన్‌మెంట్‌ జోన్‌ల గుర్తింపులో అప్రమత్తంగా ఉండాలని, కంటైన్‌మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పేర్కొన్నారు.

కోవిడ్‌–19 సంక్రమణ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన మరింత పెంచాలని సూచించారు. వీక్లీ కేస్‌ పాజిటివిటీ రేటు 10 శాతానికి మించితే, ఒకేసారి కార్యాలయానికి హాజరయ్యే ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు, సామాజిక దూరం పాటించేందుకు వీలుగా కార్యాలయ సమయాలను మార్చాలని రాష్ట్రాలకు, యూటీలను కేంద్రం ఆదేశించింది.

కేంద్రం రూపొందించిన కొత్త మార్గదర్శకాలు

కేంద్రం అనుమతిలేకుండా రాష్ట్రాలు స్థానికంగా లాక్‌డౌన్‌ను విధించలేవు, కానీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం "నైట్ కర్ఫ్యూ" వంటి ఆంక్షలను అమలు చేయవచ్చు.

మాస్క్‌లు, భౌతికదూరం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. మార్కెట్లు, వారాంతపు సంతలకు నియమాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలో జారీ చేయనుంది.

కరోనా ప్రస్తుత పరిస్థితి ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రమే రాత్రి పూట కర్ఫ్యూ విధించుకోవచ్చు. ఒకవేళ లాక్‌డౌన్‌ విధించాలనుకుంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుండి అనుమతి తీసుకోవలసి ఉంటుంది.

సూక్ష్మ స్థాయిలో, జిల్లా అధికారులు కంటైన్‌మెంట్ జోన్‌ల గుర్తింపులోఅప్రమత్తంగా ఉండాలి. ఈ జాబితాను రాష్ట్రాలు / కేంద్ర ప్రాంతాలు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయాలి. దీన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా షేర్‌ చేయాలి.

కంటైన్‌మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి. ఇంటింటికీ పర్యవేక్షణ, నిఘా ఉండాలి. వైద‍్యం, అత్యవసర సేవలు, అవసరమైన వస్తువులు, సేవల సరఫరాను మినహాఈ జోన్లలో ప్రజల కదలికలపై నియంత్రణ అమలు కావాలి. ఇందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించనివారికి తగిన జరిమానా విధించాలని ఆదేశించింది. అంతేకాదు కార్యాలయాల్లో ఫేస్ మాస్క్‌లు ధరించని వ్యక్తులపై కూడా జరిమానాలు విధించాలని తెలిపింది.

రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఆరోగ్య సేతు యాప్‌ను విధిగా అందరూ వినియోగించాలి. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చిన కేంద్ర హోంశాఖ అంతర్జాతీయ ప్రయాణికులను నిబంధనల ప్రకారం అనుమతించాలని పేర్కొంది.

కంటైన్‌ మెంట్‌ జోన్ల వెలుపల 50శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లకు అనుమతి. క్రీడాకారుల శిక్షణ నిమిత్తం మాత్రమే స్విమ్మింగ్‌ పూల్స్‌కు అనుమతి. సామాజిక, ఆధ్యాత్మిక, క్రీడా/వినోద/ విద్య/సాంస్కృతిక/ మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య వేదిక సామర్థ్యంలో 50 శాతానికి మించకూడదు. ఇతర కార్యక్రమాలకు 200 మందికి పైగా వ్యక్తులు అనుమతించబడరు. ఈ నిబంధనలు 2020 డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటాయని భావిస్తున్నారు.