Representational Image (File Photo)

Mumbai, June 12: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్టులకు సంబంధించి బీమా నియంత్రణ సంస్థ ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (IRDAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. పాలసీదారులకు నగదు అవసరాలు తీర్చుకునేందుకు సేవింగ్స్‌కు సంబంధిత బీమా ఉత్పత్తులపై ఆయా బీమా సంస్థలు విధిగా రుణసదుపాయం (Loan) కల్పించాలని సూచించింది. అలాగే, పాలసీ నియమనిబంధనలను అర్థం చేసుకునేందుకు ఇచ్చే ప్రీలుక్‌ పీరియడ్‌ను 15 నుంచి 30 రోజులకు పెంచాలని పేర్కొంది. ఈమేరకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు సంబంధించిన మాస్టర్‌ సర్క్యులర్‌ను బుధవారం జారీ చేసింది.

IRDAI: హెల్త్ ఇన్సురెన్స్ క్ల‌యిమ్ చేసుకోవ‌డం ఇక మ‌రింత సులువు, గంట‌లోపే నిర్ణ‌యం చెప్పాలంటూ రెగ్యులేట‌రీ అథారిటీ ఆదేశాలు 

కోట్లాది మంది పాలసీదారుల ప్రయోజనాలు కాపాడేందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా ఈ సర్క్యులర్‌ను జారీ చేసినట్లు ఐఆర్‌డీఏఐ (IRDAI) పేర్కొంది. ఆవిష్కరణలను, కస్టమర్ అనుభవాన్ని, సంతృప్తిని మెరుగుపరచడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడంలో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్లు తెలిపింది. ఈ సర్క్యులర్‌లో భాగంగా పెన్షన్‌ ప్రొడక్టులలో పాక్షిక విత్‌డ్రాకు అనుమతించాలని బీమా సంస్థలకు సూచించింది. పిల్లల ఉన్నత విద్య, వారి వివాహం, ఇంటి కొనుగోలు/ నిర్మాణం, వైద్య ఖర్చులు వంటి ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈ వెసులుబాటు కల్పించాలంది.

పాలసీల సరెండర్ విషయంలో.. సరెండర్ చేసే పాలసీదారులకు, కొనసాగుతున్న పాలసీదారులకు సహేతుకత, వారి సొమ్ముకు తగిన విలువ అందేలా చూడాలని ఐఆర్‌డీఏఐ (IRDAI) పేర్కొంది. పాలసీదారుల ఫిర్యాదుల పరిష్కారానికి బలమైన వ్యవస్థలను ఏర్పాటుచేయాలంది. ఏదైనా ఫిర్యాదుకు సంబంధించి బీమా అంబుడ్స్‌మన్‌ ఆదేశాలను 30 రోజుల్లో అమలుచేయనట్లయితే ఒక్కో ఫిర్యాదుపై రోజుకు రూ.5వేలు చొప్పున బీమా సంస్థ జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని సర్క్యులర్‌లో పేర్కొంది. మిస్‌- సెల్లింగ్‌ అరికట్టడంతో పాటు పాలసీదారులకు నష్టం వాటిల్లకుండా బీమా సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించింది.